గౌతమిని వెంటాడి చంపారు: పావని వాంగ్మూలం ఇచ్చినా..?, డ్రైవర్ అరెస్ట్
జనవరి 18న రాత్రి పాలకొల్లు-నరసాపురం మార్గమధ్యలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసాపురం పట్టణానికి చెందిన గౌతమి మృతిపై నెలకొన్న అనేక సందేహాలు నివృత్తి కావడం లేదు.
పశ్చిమగోదావరి: జనవరి 18న రాత్రి పాలకొల్లు-నరసాపురం మార్గమధ్యలో దిగమర్రు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసాపురం పట్టణానికి చెందిన గౌతమి మృతిపై నెలకొన్న అనేక సందేహాలు నివృత్తి కావడం లేదు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ వి రత్న తెలిపారు.
ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను విచారణాధికారిగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని, తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేసును హత్యకేసుగా మార్పుచేయలేదని, తగిన ఆధారాలను బట్టి కేసును మార్పు చేస్తామని స్పష్టం చేశారు.
గౌతమి హత్య కేసులో కీలక మలుపు: టీడీపీ నేతతో పెళ్లి ఫొటోలు వెలుగులోకి
పావని ఆసుపత్రిలో ఇచ్చిన వాంగ్మూలం మేరకు క్రైం నెంబరు 15/2017 అండర్ సెక్షన్ 304(ఏ), 338 ఐపిసి సెక్షన్ల కింద పాలకొల్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారని అదనపు ఎస్పీ రత్న చెప్పారు. ఆసుపత్రినుంచి డిశ్చార్జి అయిన తర్వాత జనవరి 22న పోలీసులకు ఇచ్చి న వాంగ్మూలంలో మరిన్ని వివరాలు తెలిపిందన్నారు.
వెంటాడి చంపారు
తమను పాలకొల్లు నుంచే వెనుక కారులో ఇద్దరు యువకులు, డ్రైవరు కలిసి వెంబడించి వేధించారని పావని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఏఎస్పీ వివరించారు. ఆమె చున్నీ లాగారని, రెండు, మూడుసార్లు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టే ప్రయత్నాలు చేశారని, వారు తప్పించుకున్నా.. చివరకు వాహనాన్ని ఢీకొని కారు కాలువలోకి వెళ్ళిపోయిందని బాధితురాలు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు రత్న వివరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఈ కేసులో రకరకాల కథనాలు రావడంతో కేసు దర్యాప్తు అధికారిని ఉన్నతాధికారులు మార్పుచేసి ఆ బాధ్యతను తనకు అప్పగించారని ఏఎస్పీ రత్న చెప్పారు. తన ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, విశాఖపట్న నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి విజయవాడ వరకు ఆ కారు వెళ్ళిన మార్గంలోని టోల్ఫ్లాజాల సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలిస్తున్నామన్నారు.
ప్రస్తుతం విశాఖపట్నంకు చెందిన కారు యజమాని సందీప్, డ్రైవరు ప్రతాప్ను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కారు యజమాని, డ్రైవరు మాట్లాడిన ఫోన్నెంబర్లు ఆధారంగా సంబంధిత వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. కారలో పెట్రోల్ కూడా ఏ బంకుల్లో కొట్టించారో విచారణ చేస్తున్నామన్నారు. కారులో ఎంతమంది ప్రయాణించారో అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
ప్రమాదం జరిగిన తర్వాత వారంతా రాజమండ్రి వెళ్ళి అక్కడినుంచి విశాఖపట్నం బస్సులో వెళ్ళిపోయారని, వారికి కూడా దెబ్బలు తగిలాయని చెప్పారు. రెండురోజుల్లో పూర్తివిచారణచేసి తదుపరి చర్యలు చేపడతామన్నారు.
కాగా, కేసు విచారణాధికారి, అదనపు ఎస్పీ రత్న పాలకొల్లు - నరసాపురం రహదారిలోని సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం నరసాపురం చేరుకుని బాధితురాలు పావని వాంగ్మూలం నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సజ్జా బుజ్జి భార్య శిరీష వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు తెలిసింది. అయితే, పావని వాంగ్మూలం తీసుకున్న తర్వాతనైనా.. నిందితులపై హత్యానేరం మోపారా? లేదా? అనేది తెలియరాలేదు.