హైకోర్టు వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టు: గంటా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందని, ఇది ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.
ఓపెన్ యూనివర్శిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, జెఎన్టియు తదితర విద్యా సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించిందన్నారు. గతంలో పరీక్షల విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వలన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని గంటా అన్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని గతంలో మాదిరి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించినా, తెలంగాణ ప్రభుత్వం వినలేదని ఆయన అన్నారు. ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రతికూలంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణలో చదువుకోడానికి వీల్లేదా అని కోర్టు ప్రశ్నించిందని చెప్పారు.
ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహార శైలిని కోర్టు తీవ్రంగా పరిగణించిందని అన్నారు. బ్యాంకు ఖాతాలను ఎలా స్తంభింప చేస్తారని బోర్డు కార్యదర్శి, బ్యాంకర్లను ప్రశ్నించిందని గంటా వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ యూనివర్శిటీల ప్రాంతీయ కార్యాలయాలను యథావిధిగా కొనసాగించాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు.
ఏపి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టద్దని కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిందని ఆయన తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి శ్రీనివాసరావు మరోసారి విజ్ఞప్తి చేశారు.