ముద్రగడ చెప్పినట్లే..! అంత్యక్రియలు, క్రాంతిపై తేల్చేసిన కుమారులు..!
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(mudragada padmanabham) అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన్ను చివరి చూపు చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతి బార్లపూడిని కుటుంబ సభ్యులంతా కలిసి అడ్డుకున్నారు. దీంతో పోలీసుల సాయంతో ఆమె తండ్రి శవాన్ని దూరం నుంచి చూసి ఏడుస్తూ వెళ్లిపోయారు. అనంతరం వైసీపీ ప్రభావంతోనే కుటుంబ సభ్యులు ఇలా చేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబు ఇవాళ ఓ లేఖ విడుదల చేశారు.
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ (Mudragada Padmanabham)
ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక అని, రాజకీయాలు, పదవుల కంటే వ్యక్తిత్వానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారని కుమారులు తెలిపారు. తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా నిర్వహించాలో ముద్రగడ ముందుగానే కుటుంబ సభ్యులకు స్పష్టంగా సూచించారని, అదే విధంగా అంత్యక్రియలు నిర్వహించామని వెల్లడించారు. ప్రభుత్వ లాంఛనాలు లేదా ప్రభుత్వ సహాయం తీసుకోకూడదని కుటుంబం నిర్ణయించుకుందని, అందుకే అధికారిక లాంఛనాలను తిరస్కరించినట్లు తెలిపారు.

అంతిమ సంస్కారాలపై ముందే హింట్
సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న వివిధ వ్యాఖ్యానాలపై స్పందిస్తూ, ముద్రగడ వ్యక్తిత్వం, ఆయన అభిప్రాయాలు ఎంత దృఢంగా ఉండేవో అందరికీ తెలిసిందే అన్నారు. అంతిమ సంస్కారాలు ఎలా జరగాలనే విషయాన్ని ముద్రగడ స్వయంగా నిర్దేశించారని, కుటుంబం ఆయన కోరికల మేరకే అన్ని నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాల్లో ఎలాంటి రాజకీయాలు లేదా ఎవరి ప్రలోభాలు లేవని పేర్కొన్నారు. ఉద్యమ నేతగా ఎన్నో అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్న ముద్రగడకు అధికారిక లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదని తెలిపారు.
క్రాంతిని అందుకే రానివ్వలేదు
బార్లపూడి క్రాంతి కుటుంబంతో గత కొన్ని సంవత్సరాలుగా తమకు ఎలాంటి రాకపోకలు, సంబంధాలు లేవని తెలిపారు. ఆ పరిస్థితికి కారణాలు ఏమిటో ముద్రగడ స్వయంగా గతంలో మీడియా ద్వారా వివరించారని పేర్కొన్నారు.క్రాంతి రాకూడదన్న నిర్ణయం నుంచి ఇంటి ఆవరణలో ఖననం చేయాలన్న నిర్ణయం వరకు ప్రతి నిర్ణయమూ ముద్రగడ పద్మనాభం చివరి కోరికల ప్రకారమే తీసుకున్నామని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు, ఊహాగానాలు ప్రచారం చేసి తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేయవద్దని మీడియాను విజ్ఞప్తి చేశారు. ఈ విషాద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, ముద్రగడపై ఉన్న గౌరవాన్ని చాటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.















Click it and Unblock the Notifications