ఎవరో రాస్తే ముద్రగడ పోస్ట్ చేస్తున్నారు: జగన్ను టార్గెట్ చేసిన గంటా
హైదరాబాద్/ విజయవాడ: కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వెనక వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్ ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు పరోక్షంగా విమర్సలు చేశారు. జగన్ పేరు ప్రస్తావించకుండా ముద్రగడపై ఆయన నిప్పులు చెరిగారు.
ముద్రగడ పూనకమొచ్చినట్టు నెలకోసారి లేఖ రాస్తున్నారని ఆయన ఆరోపించారు. ముద్రగడ లేఖలోని భాష అభ్యంతరకరమని గంటా అన్నారు. కొన్ని రాజకీయ శక్తుల చేతిలో ముద్రగడ కీలుబొమ్మగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. ఎవరో రాసిన లేఖలను ముద్రగడ పోస్ట్ చేస్తున్నారని గంటా ఆరోపించారు. టీడీపీకి కాపులు ఏకపక్షంగా మద్దతు ఇచ్చారని, కాపుల రుణం తీర్చుకుంటామని మంత్రి అన్నారు. ముద్రగడ మంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లు గుర్తు రాలేదా? అని మంత్రి గంటా ప్రశ్నించారు.

ఇదిలావుంటే, ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను విడతలవారీగా అమలు చేస్తామని టీడీపీ నేత కళా వెంకట్రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత పదేళ్ళుగా కాంగ్రెస్ కాపు కులానికి ఎం చేసిందని ఆయన ప్రశ్నించారు.
అప్పుడు లేని ఆరాటం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. పార్టీ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఆరాటం పడుతున్నారని వెంకట్రావు విమర్శించారు. తిరుపతిలో మూడురోజుల పాటు జరిగే మహానాడుకు 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, 28 తీర్మానాలపై చర్చిస్తామని అన్నారు. నదుల అనుసంధానం, సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం వంటి పలు అంశాలపై చర్చిస్తామని వెంకట్రావు తెలపారు.












Click it and Unblock the Notifications