విభజన జరిగితే కాంగ్రెసులో ఉండను: మంత్రి గంటా
హైదరాబాద్: శాసనసభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు -2103 వీగిన తర్వాత కూడా కేంద్రం ఇంకా విభజన దిశగా ముందుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీలో ఉండనని కోస్తాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
తనతో సహా మరో ఆరు, ఏడు మంది శానససభ్యులు ఇదే నిర్ణయం తీసుకున్నరని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్లో ఎందుకు ఉంటామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కాకుంటే సమైక్యాన్ని వాంఛించే తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, లేదంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని స్థాపిస్తే ఆయన పార్టీలో చేరుతామని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని గంటా స్పష్టం చేశారు.
గంటా శ్రీనివాస రావు కాంగ్రెసు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతారని గత కొంత కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అందులో భాగంగానే ఆయన సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్లిన గంటా శ్రీనివాసరావు పార్టీ విలీనంతో కాంగ్రెసులోకి వచ్చారు.
కాంగ్రెస్ పార్టీలోనే తాను ఎదిగానని, ఎవరు పార్టీ పెట్టినా కాంగ్రెస్ను వీడే ప్రసక్తే లేదని సీమాంధ్ర మంత్రి మహీధర్రెడ్డి స్పష్టం చేశారు. విప్ ఉండదు కాబట్టి తమ అభిప్రాయాలు చెబుతామని ఆయన చెప్పారు.