నవ వధువు ఆత్మహత్య: ఫ్లాట్లో ఉద్యోగి సూసైడ్
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటుచేసుకుంది. ఓ నవవధువు విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇష్టంలేని పెళ్లే కారణమని పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
ఇదిలావుంటే, విశాఖపట్నం జిల్లా తగరపువలసలోని అపార్టుమెంట్లో ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దంపతుల ఆత్మహత్య
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం మురికిపూడిలో విషాదం చోటు చేసుకుంది. పంటపొలాల్లో దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చచెందారు. గుత్తి సమీపంలోని టోల్గేటు వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఎస్ఎల్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి మదనపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సును వేగంగా నడపడంతో ఒక్కసారిగా కుదుపుకు గురై రోడ్డుపై బోల్తా పడింది.
వివాహం చేసుకోబోతున్న విజయ అనే యువతి ఈ ప్రమాదంలో మృతి చెందింది. మరో 26 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలైన పది మందిని అనంతపురం ఆస్పత్రికి తరలించారు.