యువతి అనుమానాస్పద మృతి: రేప్ చేసి, హత్య చేశారా?
విజయవాడ: కృష్ణా జిల్లాలోని వత్సవాయి మండలం చింగవరం దగ్గర యువతి అనుమానాస్పద మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. యువతిని అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఆస్పత్రి నుంచి పురిటి బిడ్డ మాయం
తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో శిశువు మాయమైంది. బంధువు అని చెప్పి గుర్తుతెలియని మహిళ శిశువును అపహరించుకు వెళ్లింది. దీంతో అలిపిరి పోలీసులు విచారిస్తున్నారు. ప్రసూతి ఆసుపత్రిలో శిశువు అపహరణ సంఘటన తిరుపతిలో సంచలనం సృష్టించింది.
యువకుని హత్య
కోడి పందాలు ఏ యువకుడి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పొదిలి గ్రామంలోని శ్రీపతి నగర్లో సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు.
గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (27) కోడి పందాలు ఆడేవాడు. ఈ వ్యవహారంలో అక్కడ కొంత మందితో ఘర్షణలు తలెత్తాయి. అక్కడ జరిగిన గొడవలో కొందరు వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లుపై కత్తులతో దాడి చేశారు. దాంతో అతను మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.