బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్: తండ్రిని చంపిన కొడుకు, జేబు దొంగ హత్య
హైదరాబాద్: నలుగురు యువకులు ఒక బాలికపై రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై నిర్భయం చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. విషాదకర ఈ సంఘటన ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ దగ్గర జరిగింది. మాచాపూర్ వద్ద కారు బైక్ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు.
ఆటో బోల్తా, డ్రైవర్ మృతి
కరీంనగర్ జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాసుపల్లి దగ్గర ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు.
మంటల్లో కారు దగ్ధం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే, కారులో మంటలు రేగిన వెంటనే యజమాని, డ్రైవరు దూకేయడంతో ప్రాణనష్టం జరగలేదు.
జేబు దొంగ హత్య
హైదరాబాద్ నగరంలోని చాంద్రాయణగుట్ట పోలీసుస్టేషను పరిధిలోని తడ్లకుంట సమీపంలోని మిల్లత్ కాలనీలో షకీల్ అనే ఓ జేబుదొంగను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
3 కిలోల బంగారం స్వాధీనం
బ్యాంకాక్, కౌలాలంపూర్ల నుంచి గురువారం వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఎలాంటి పత్రాలు లేని బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను ప్రశ్నిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ప్రమాదం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి ప్రైవేటు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బస్సు డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కన్న తండ్రిని చంపిన కుమారుడు
చిత్తుగా తాగి మద్యం మత్తులో కన్న తండ్రినే గొంతు నులిమి చంపిన కొడుకు ఉదంతం ఒకటి నల్గొండ జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. మర్రిగూడ మండలం అంతంపేటలో తాగిన మైకంలో కొడుకు తండ్రిని చంపిన సంఘటన జరిగింది. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. తండ్రిని చంపిన కొడుకు నిర్వాకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.