పెళ్లికి ముందే గర్భం: గురుకులంలోనే అమ్మాయి ప్రసవం
నిజామాబాద్ జిల్లా పిట్లం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. మైనార్టీ తీరని బాలికతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆమె గర్భం దాల్చేందుకు కారణమైన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు.
బోధన్ డిఎస్పీ గౌస్మొహియుద్దీన్ కథనం ప్రకారం - అల్లాపూర్ గ్రామానికి చెందిన గైని గంగారాంకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తెను పిట్లంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చదివిస్తున్నాడు. మగ సంతానం లేకపోవడంతో చిన్నకూతురికి ఇల్లరికం అల్లుడు తెచ్చుకోవాలని నిర్ణయించుకుని పదేళ్ల క్రితమే కారేగాం గ్రామానికి చెందిన గోపాల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటి నుండి గోపాల్ వీరివద్దే ఉండేవాడు. గంగారాం చిన్నకుమార్తె కస్తూర్బా పాఠశాలలోటెన్త్ చదువుతోంది. గోపాల్, అమ్మాయ మధ్య శారీరక సంబంధం ఏర్పడింది.
పిట్లంలో సెల్ఫోన్ షాపు నిర్వహించే గోపాల్ తరుచూ అల్లాపూర్కు వచ్చేవాడు. గంగారాం కుమార్తె పాఠశాల ఎగ్గొట్టి తరచూ ఇంటిపట్టునే ఉండేది. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చినప్పటికీ, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఏడు నెలల గర్భవతి అయిన బాలిక, గత ఇరవై రోజుల నుండి గురుకులంలోనే ఉంటోంది. మొదటి అంతస్తులో గల తన గదిలో ఆమె మగబిడ్డను ప్రసవించింది.
శిశువును కిటికీ నుండి కిందకు విసిరేసింది. పసికందు ఏడుపు విన్న గురుకులంలోని తోటి బాలికలు విషయాన్ని గురుకులం ప్రత్యేక అధికారిణి సరిత దృష్టికి తీసుకెళ్లగా ఆమె పోలీసులకు సమాచారం అందించారు. గురుకులం నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి రాస్తారోకో నిర్వహించింది.