సంచలన తీర్పు: రేప్ కేసులో నిందితునికి మరణించే వరకు జైలు శిక్ష
అమరావతి: రేప్ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పుని వెలువరించింది. 15 ఏళ్ల బాలిక రేప్ కేసులో నిందితునికి జీవిత ఖైదు (మరణించే వరకు జైలు), రూ. 50 వేల జరిమానా విధిస్తూ మంగళవారం జడ్జి జి. అనుపమ తీర్పు వెలువరించారు.
వివరాల్లోకి వెళితే నగరంలోని పటమటకు చెందిన జంగంశెట్టి సునీల్ ప్రభు కుమార్ అలియాస్ సునీల్(23) రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో ఓ స్కూల్లో డ్యాన్స్ మాస్టర్గా విధులు నిర్వహించేవాడు. అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.
ఆ తర్వాత మనమిద్దరం పెళ్లి చేసుకుందామని నమ్మించాడు. 2013 ఏప్రిల్ 16న బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పోలీసుల విచారణలో బాలికను మాయమాటలతో నమ్మించి సునీల్ అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్లాడని తేలింది. దీంతో బాలిక బంధువులు అక్కడికి చేరుకోగానే నిందితుడు పరారయ్యాడు. అనంతరం బాలికను పటమట పోలీసుల వద్దకు తీసుకునిరాగా, నిందితుడు సునీల్ హైదరాబాద్లో బాలికపై అత్యాచారం చేశాడని చెప్పింది.
దీంతో అత్యాచారం జరిగిందా లేదా అనే నిర్ధారణ కోసం పోలీసులు బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. సరైన సాక్ష్యాలను సేకరించిన పోలీసులు నిందితుడు సునీల్పై కిడ్నాప్, రేప్ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో 13 మంది సాక్ష్యులను ప్రవేశపెట్టారు. సాక్ష్యాల పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి, నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో మరణించే వరకు (జీవితకాలం) జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.