విద్యార్థినిపై అత్యాచారం: లక్షన్నర మూల్యం, కేసు
ఖమ్మం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలంలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం టు టౌన్ పోలీసులు శుక్రవారం 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, పంచాయతీ పెద్దలు అత్యాచారానికి మూల్యం కట్టారు.
కొత్తగూడెం మండలం గరీబుపేటకు చెందిన బాలిక భద్రాచలంలోని రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆ బాలిక పదో తరగతి చదువుతున్నప్పుడే అదే గ్రామానికి చెందిన బైకిని రాజు ఆమెను బెదిరించి లోబరుచుకున్నాడు. తర్వాత గత మేలో ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె సోదరుడు ఉప్పరబోయిన రమేష్ కూడా బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు.
అప్పటి నుంచి రాజు, రమేష్ బాలికను బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారు. ఈ నెల 3న బాలికను ఆటోలో తీసుకెళ్లి భద్రాచలం సమీప పర్ణశాల వద్ద ఇద్దరూ అత్యాచారం జరిపారు. ఆమె ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్కు చెప్పినా పట్టించుకోలేదు. అంతేకాకుండా బాలిక ప్రవర్తన బాగాలేదంటూ ఇంటికి పంపించేశాడు. బాలిక నాయనమ్మ ఈ విషయాన్ని గ్రామంలో కొందరి దృష్టికి తెచ్చింది.
దీంతో వారు పంచాయతీ నిర్వహించి బాలికకు రూ.1.50 లక్షలు ఇచ్చేలా తీర్మానించారు. అత్యాచారం విషయం తెలుసుకొన్న కొత్తగూడెం టు టౌన్ పోలీసులు శుక్రవారం రాజు, రమేష్తోపాటు పంచాయతీ నిర్వహించిన మరో 10మందిపై నిర్భయ, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.