నాలుగేళ్ల బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
హైదరాబాద్: ఓ వృద్ధుడు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సికింద్రాబాదులోని జీడిమెట్ల పరిధిలోని రాంరెడ్డినగర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళ మృతి
మహబూబ్నగర్ జిల్లాలోని షరూక్నగర్ మండలం రాయకల్ టోల్ప్లాజా వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు.అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను అనంతపురం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
నల్గొండ జిల్లాలోని రైల్వే ప్లైఓవర్ దగ్గర రైలు కిందపడి తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే, నల్గొండలో గుర్తు తెలియని వాహనం కారును ఢీకొని ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్ల తెలిసింది. జిల్లా కేంద్రంలోని అన్నెపర్తి శివారులో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
కరీంనగర్ జిల్లాలో బట్టలు ఆరేస్తుండగా ఓ మహిళకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. జిల్లాలోని వీణవంక మండలం కొండపాకలో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.