మూగ, దళిత యువతిపై రేప్: అబార్షన్ కోసం లక్షన్నరకు బేరం
కడప: పూలు, గాజులపై ప్రేమ ఓ అమాయక మూగ, దళిత యువతిని ఓ మృగాడి బారిన పడేసింది. పూలు, గాజులు ఇస్తానని ఆశపెట్టి ఓ దుర్మార్గుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని తాతగారి ఊరు దాచెరువులో ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కడపజిల్లా రైల్వేకోడూరు మండలం వెంకటరెడ్డి పల్లె పంచాయతీలోని దళితవాడకు చెందిన మూగయువతి (20) తన తల్లితో కలసి ఆరు నెలల క్రితం నెల్లూరు జిల్లాలో తన తాతగారి ఊరైన దాచెరువు గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమెపై కన్నేసిన స్థానిక యువకుడు ఆమెకు పూలు, గాజులు అమితమైన ఇష్టమని గ్రహించాడు.
తాను చెప్పినట్టు వింటే వాటిని ఇస్తానని ఎర వేశాడు. అతడి మాటలు నమ్మి ఆమె ఆ మాటలు విని అతడు చెప్పిన స్థలానికి వెళ్లింది. అక్కడ అతను తన కోరిక తీర్చుకున్నాడు. ఆమె చేతిలో రూ.30 పెట్టాడు. తిరిగి వెంకటరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆమె గర్భం దాల్చింది.
ఏం జరిగిందో బంధువులు ఆరా తీశారు. ఆమెను తీసుకుని దాచెరువు గ్రామానికి వెళ్లారు. అక్కడ పెద్దమనుషులతో పంచాయితీ చేశారు. గ్రామంలోని 30 మంది యువకులను వరుసగా నిలబెట్టారు. వరుసలో ఉన్న ఒక యువకుడిని మూగ యువతి చూపించింది.
పంచాయితీ పెద్దలు బేరసారాలు జరిపి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడు రూ.50 వేలు ఇస్తాడని, ఆ సొమ్ముతో ఆమె గర్భం తీయించుకోవాలని నిర్ణయించారు. అబార్షన్ చేస్తే ఆమె ప్రాణం పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో గర్భం అలాగే ఉంచుకుంది.
విషయం తెలిసిన ఆమె బంధువులు ఐదు రోజుల క్రితం వెంకటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని మూగ యువతి అన్న తెలిపారు.