ఆత్మహత్యేనా?: ఎన్. ట్రిపుల్ ఐటీలో భవనంపైనుంచి దూకేసిన విద్యార్థిని
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మూడ్రోజుల వ్యవధిలోనే నూజివీడు ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చోటు చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
శనివారం నూజివీడు ట్రిపుల్ ఐటీలో రమాదేవి అనే ఫస్టియర్ విద్యార్థిని భవనం పైనుంచి దూకేసింది. ఆమెను హుటాహుటిన విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. రమాదేవి ఆముదాలవలస వాసి.

అయితే, ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట మానసిక ఒత్తిడితో భవనంపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం.. ఆ తర్వాత అనారోగ్య కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తెలపడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందనే మరో వాదన వినిపిస్తోంది.
భవనం పైనుంచి దూకితే తలకు తీవ్రమైన గాయాలు కావాల్సి ఉండగా, ఆమె చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications