బెజవాడలో దారుణం: చిన్నారి ప్రాణం తీసిన నూడిల్స్, థమ్సప్ తాగి క్షణాల్లో మృతి
అమరావతి: కృష్ణాజిల్లాలోని విజయవడాలో దారుణం జరిగింది. నూడిల్స్ ఓ అమ్మాయి ప్రాణాన్ని తీసింది. గడువు తీరిన నూడిల్స్ తినడంతో ఓ చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకి వెళితే.... జిల్లాలోని పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన వలశిల విజయ్కుమార్, అతని భార్యతో కలసి కొండపల్లిలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి సోమవారం సాయంత్రం వెళ్లారు.
వీరికి ముగ్గురు కుమార్తెలు మానస(15), మమత, థెరీసాలను ఇంట్లోనే ఉంచి వెళ్లారు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో రాత్రి అక్కాచెల్లెళ్లు మ్యాగీ నూడిల్స్ చేసుకుని థమ్సప్ తాగారు. ఆ తర్వాత మానస నురగలు కక్కతూ అపస్మారక స్తితిలోకి వెళ్లడంతో చట్టుపక్కల వాళ్లు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.
దీంతో బాలిక తల్లిదండ్రులు అక్కడే ఉన్న మేనమామకు విషయాన్ని చెప్పడంతో వెంటనే వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు తాము వైద్యం చేయలేమని, వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచిచండంతో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మానస మృతి చెందింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు మాత్రం గడువు తీరిన నూడిల్స్ తినడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. అయితే మానసతో పాటు నూడిల్స్ తిన్న మరో ఇద్దరు కూడా ప్రస్తుతం చావు బతుకుల్లో ఉన్నారు.
సాయంత్రం నూడిల్స్ తినడానికి ముందు మధ్యాహ్నాం వేళ బాలికలు ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అయితే ఇది కూడా బాలిక చనిపోవడానికి ఏమైనా కారణం అయి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.