బాలికల హాస్టల్లో కలకలం: రాత్రిపూట జుట్టు కత్తిరింపు.. ఎవరై ఉంటారు?
చున్నీలు ముఖంపై కట్టుకుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ జుట్టు కత్తిరించి ఉంటారని కొంతమంది విద్యార్థినులు చెబుతున్నందునా.. సీనియర్లే ర్యాగింగ్ చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏలూరు: నిన్నటిదాకా 'మహిళల జుట్టు కత్తిరింపు' ఉదంతాలు ఉత్తరభారతానికే పరిమితం కాగా.. ఇప్పుడు దక్షిణ భారతానికి అది పాకినట్లుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం గోడి ప్రభుత్వ గురుకుల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల జుట్టును గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు.
శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన హాస్టల్ బాలికలను భయభ్రాంతులకు గురిచేసింది. చున్నీలు ముఖంపై కట్టుకుని ఉన్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ జుట్టు కత్తిరించి ఉంటారని కొంతమంది విద్యార్థినులు చెబుతున్నందునా.. సీనియర్లే ర్యాగింగ్ చేసి ఉంటారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
విద్యార్థినుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి 11.30 గంటల వరకు నైట్వాచ్మన్ ఉందని, చదువుకుని వెళ్లి పడుకున్నాక ఎవరో తమ జుట్టు కత్తిరించారని వారు వాపోతున్నారు. ఆదివారం ఉదయం స్నానాలకు వెళుతున్నప్పుడు ముడి వేసుకుంటుండగా తమ జుట్టు కత్తిరించి ఉన్నట్టు గమనించామని బాధిత విద్యార్థినులు తెలిపారు.
9-10ఏళ్ల వయసున్న నలుగురు జూనియర్ విద్యార్థినుల జుట్టును కత్తిరించినట్లు హాస్టల్ యాజమాన్యం గుర్తించింది. వీరిలో ఒకరి జుట్టును బకెట్లో పడేయగా, మిగిలిన ముగ్గురి జుట్టు కిటికీలోంచి బాత్రూమ్ వైపు పడేశారని బాధిత విద్యార్థినులు తెలిపారు.
హాస్టల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాత్రం దీనిపై స్పందించారు. ప్రతిరోజు రాత్రి 9 వరకు స్టడీ అవర్స్ ఉంటాయని, 7 గం. మెయిన్ గేటు మూసివేస్తామని, కాబట్టి బయటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం లేదని అన్నారు. రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు రాబడుతామన్నారు.