మోడీ నుంచి రాయలసీమ దాకా: బీజేపీపై బాబు తీవ్ర ఆగ్రహం, 'మంచి నేత పట్ల ఇలాగా'
అమరావతి: బీజేపీపై ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన జరిగి నాలుగేళ్లయినా ఆ గాయాలు మానలేదన్నారు. విభజన కారణంగా ఎపీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు.
షా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనం
అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఒక్కో ఎంపీ నుంచి చంద్రబాబు అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందుకే ప్రత్యేక ప్యాకేజీకి సరేనని చెప్పా
ఏపీకి ప్రత్యేక హోదా వద్దని తాను చెప్పినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారని, తాను అలా ఎన్నడూ అనలేదని చంద్రబాబు అన్నారు. హోదాకు సమానంగా ప్యాకేజీ, ప్రయోజనాలు ఇస్తామన్నందుకే అంగీకరించానని చెప్పారు. కానీ ఇతర రాష్ట్రాలకు కూడా హోదా ఉండదని చెప్పి, ఇప్పుడు కొనసాగిస్తున్నారని, అందులోని ఆంతర్యం ఏమిటన్నారు.
బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పైన ఆగ్రహం
ఇతర రాష్ట్రాలకు హోదా ఇస్తున్నందున ఏపీకి ఇవ్వాలని చంద్రబాబు అన్నారు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పైన చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ చిత్తశుద్ధితో పోరాడుతోందని చెప్పారు. ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.
వైసీపీకి విశ్వసనీయత లేదు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ నాటకాలు ఆడుతోందన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొందని, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, ఆర్థిక లోటు, రాజధాని వంటివి వదిలేసి హోదా ఒక్కటే సరిపోదన్నారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలన్నారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని, వారు అడిగేది ఇవ్వాలని, తాను పుస్తకాలు రాసుకోవడానికి సిద్ధంగా లేనని, పుట్టుకతో రాజకీయ నాయకుడిని అన్నారు. ఓ వైపు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సినవి రావడం లేదని, మరోవైపు ఏపీ బీజేపీ నేతలు ఇరుకున పడేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీలు ఏమన్నారంటే
ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. మంచి నాయకుడిని (చంద్రబాబు) కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇంకా ఏదో చేస్తుందని అనుకోవడం భ్రమేనని, మనపై ప్రజల్లో దురభిప్రాయం రాకుండా చూసుకోవాలని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.