ఏపీలో సూపర్ న్యూస్ .. మచిలీపట్నంలో రూ.8,000 కోట్లతో గోవా షిప్యార్డ్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో భారీ శుభవార్త చెప్పింది. ఏపీలో ఇప్పటికే అనేక ప్రైవేట్ దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఏపీకి శుభవార్త చెప్పింది. ఏపీలోని గోవా షిప్యార్డ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో భారీ షిప్యార్డ్ ఏర్పాటుకు రూ.8,000 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
మచిలీపట్నం పోర్ట్ ప్రాంతంలో గోవా షిప్ యార్డ్ గ్రీన్ఫీల్డ్
ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే ఏపీలో ఆధునిక యుద్ధనౌకల నిర్మాణం, రక్షణ సామగ్రి తయారీ, షిప్ రిపేర్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. గోవా వెలుపల మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున విస్తరణకు సంస్థ సిద్ధమవుతోంది. మచిలీపట్నం పోర్ట్ ప్రాంతంలో ఈ గ్రీన్ఫీల్డ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జీఎస్ఎల్ ఒక ప్రతిపాదన సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు తో ఇప్పటికే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ వేగం పుంజుకుంటోంది.

భూకేటాయింపుపై చర్చలు
సుమారు 200 ఎకరాల భూమి కేటాయించాలని సంస్థ కోరినట్టు సమాచారం. ప్రభుత్వం ఈ విషయంపై సానుకూలంగా స్పందిస్తూ, నామినేషన్ లేదా టెండర్ ప్రక్రియ ద్వారా భూమి కేటాయింపు ఎలా చేయాలనే అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షిప్యార్డ్ ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రారంభ దశలోనే వేల మంది నేరుగా, పరోక్షంగా ఉపాధి పొందే అవకాశం ఉందని అంచనా.
షిప్ యార్డ్ తో స్థానిక నిపుణులకు ఉద్యోగావకాశాలు
ఈ షిప్ యార్డ్ ఏర్పాటు జరిగితే ఇక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కాంట్రాక్ట్ కార్మికులకు అవకాశాలు కల్పించనున్నారు. సమీప ప్రాంతాల్లో సప్లై చైన్, లాజిస్టిక్స్, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 1,054 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని సముద్ర రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కృషి చేస్తోంది.
సామర్థ్యం పెంచుకోవాలనే లక్ష్యంతోనే మచిలీపట్నంలో షిప్ యార్డ్
మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ షిప్యార్డ్ ప్రాజెక్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్ఎల్ ప్రస్తుతం భారత నావికాదళం, కోస్ట్ గార్డ్కు వివిధ రకాల నౌకలు నిర్మిస్తోంది. కొత్త ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో సామర్థ్యం పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఈ విస్తరణకు పూనుకున్నట్టు సమాచారం. ఆగ్నేయాసియా దేశాలకు కూడా నౌకలు సరఫరా చేసేందుకు తూర్పు తీరం అనుకూలంగా ఉంటుందని సంస్థ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కృష్ణాజిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
మచిలీపట్నం ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు జరిగితే కృష్ణాజిల్లా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్రం రక్షణ తయారీ రంగంలో ముఖ్య కేంద్రంగా ఎదగే అవకాశం ఉంది. ప్రభుత్వం, సంస్థ మధ్య చర్చలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
