ఏపీలో కొత్త పెన్షన్ దరఖాస్తుదారులకు ఊరట- సర్కార్ మరో కీలక నిర్ణయం..! రేపటి నుంచి..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం కొత్త పెన్షన్లు (New Pensions) విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. అయితే గతంలో ఉన్న విధంగానే ఈసారి కూడా పెన్షన్లు ఇచ్చేందుకు అర్హుల ఎంపిక కోసం పలు నిబంధనల్ని పెట్టింది. ఈ నిబంధనల్ని సంతృప్తి పరిస్తేనే పెన్షన్లకు (Pension) లబ్దిదారుల్ని ఎంపిక చేస్తోంది. అలాంటి ఓ నిబంధనపై కొత్త పెన్షన్ దరఖాస్తులదారుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఇందులో మినహాయింపు ఇచ్చింది.
రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రారంభమైంది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో స్వీకరిస్తున్న కొత్త పెన్షన్ల దరఖాస్తుల్లో ఓ నిబంధన పెట్టారు. పట్టణాల్లో ఇంటి పన్ను అసెస్ మెంట్ పూర్తయినట్లు ఆధారాలు సమర్పించాలనేది ఈ నిబంధన. ఇంటిపన్ను అసెస్మెంట్ నంబర్ ఇస్తేనే కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని ప్రభుత్వం పెట్టిన ఈ నిబంధనపై పట్టణ ప్రాంతాల్లో ఇతర అర్హతలు ఉన్న లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ప్రభుత్వం పట్టణాల్లో కొత్త పెన్షన్ల మంజూరుకు ఇంటి పన్ను అసెస్మెంట్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అంటే అసెస్మెంట్ నంబర్ ఇవ్వకపోయినా కొత్త పెన్షన్లకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈ మేరకు స్వర్ణ వార్డు సచివాలయాలకు ఆదేశాలు పంపింది. అలాగే స్వర్ణ గ్రామం-స్వర్ణవార్డుల శాఖ వెబ్ సైట్ లోనూ ఈమేరకు మార్పులు చేయబోతున్నారు. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే గతంలో వైసీపీ హయాంలో ఉన్న ఇంటి పన్ను అసెస్మెంట్ నంబర్ ఇవ్వాలనే నిబంధన నుంచి పెన్షన్ దరఖాస్తుదారులకు ఊరట లభించనుంది.














Click it and Unblock the Notifications
