వరదలో లంకగ్రామాలు -పునరావాస కేంద్రాల్లోనే : ముందస్తు హెచ్చరికలు..!!
గోదవరీ పరివాహక ప్రాంతాల్లో వదర ముంచెత్తుతోంది. ధవళేశ్వరం వద్ద ఇవాళ సాయంత్రం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వరద నీరు పోటెత్తుతోంది. కోనసీమ-గోదావరి ప్రాంతంలోని దాదాపు 40 లంక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అల్లూరి జిల్లాలోని విలీన మండలాలు దాదాపుగా వరదనీటి గుప్పిట చిక్కుకున్నాయి.
ఎటపాక, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాయనపేట, నెల్లిపాక, కన్నాయిగూడెం, మురుమూరు ప్రధాన, జాతీయ రహదారులపై వరద ప్రవాహం ధాటిగా ఉంది. కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాల్లో 6,500 మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.
దాదాపు 25,000 మంది నిరాశ్రయులైనట్లు చెప్పారు. దేవీపట్నం వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కొండమొదలు పంచాయతీలోని గ్రామాల ప్రజలు కొండలపైనే ఉంటున్నారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్దకు భారీగా వరద చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యాం పైభాగంలో ఉన్న పోశమ్మగండి- పూడిపల్లి గ్రామాలకు వరద నీరు పోటెత్తింది.

ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు భారీ వరద రానుందని సీడబ్ల్యూసీ అంచనాకు వచ్చింది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద 20 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నేటి సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చిరక జారీ చేయనున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాతో మరింత అప్రమత్తంగా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడు ఎన్డీఆర్ఎఫ్..మూడు ఎస్డీఆర్ఎప్ టీంలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇక, లంక గ్రామాలు లో ప్రజల అవస్థలు దారుణంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు అయినా..సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేవనే విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి. అనేక లంక గ్రామాల్లో ఇళ్లల్లోకి వదర నీరు చేరింది. చిన్న పిల్లలతో ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు.
వరద ప్రాంతంలో ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. గ్రామాల మధ్యనే చిన్న పడవల్లో ప్రయాణాలు చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. ప్రధానంగా సహాయం అందించటంతో పాటుగా అంటువ్యాధులు ప్రబలకండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యవసర సహాయం కోసం రాష్ట్రస్థాయి సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు. 1070, 1800 4250 101, 08632 377118 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications