బాబే కారణం: ఈశ్వరి, 'నాడు పవన్ కళ్యాణ్ ఇంటిముందు పడిగాపులు, ఈ రోజు భయమెందుకు'
హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో ప్రమాదానికి కారణం చంద్రబాబేనని, అలాంటి వ్యక్తే సంతాపం ప్రకటిస్తే ఎలాగని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సోమవారం అన్నారు. అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన అనంతరం వైసిపి ఎమ్మెల్యేలు మాట్లాడారు.
చెవిరెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా పైన నాడు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ దానిని నెరవేర్చలేకపోయారన్నారు. ఆత్మహత్యలకు వారి వల్లేనన్నారు. ప్రత్యేక హోదా పైన చర్చించాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. పుష్కరాలు, హోదా విషయంలో చంద్రబాబుకు శిక్ష పడాలన్నారు.
అంతకుముందు రోజా మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల ప్రమాదానికి కారణమైన చంద్రబాబు తమకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యమని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు తన పైన విచారణ జరిపించుకోవాలన్నారు. నిజాలు చెప్పే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమన్నారు.
కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని చంద్రబాబు చెప్పడం విడ్డూరమని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ సామెతను చెప్పడం ద్వారా ఆడ పిల్లల పట్ల ఆయనకు ఎంత చులకనో అర్థమవుతోందన్నారు.
పవన్ కళ్యాణ్కు ఎందుకు భయపడుతున్నారు!
కేవలం మోడీ పైన ఉన్న క్రేజ్, పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని రోజా అంతకుముందు అన్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్కు టీడీపీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
టీడీపీకి అంత సీన్ ఉంటే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు పడిగాపులు ఎందుకు పడ్డారన్నారు. ఒక వైపు పుష్కర తొక్కిసలాటపై చర్చిద్దామంటూనే, మరోవైపు జగన్ ను మాట్లాడనీయకుండా చేస్తున్నారన్నారు.
కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా? అనే చంద్రబాబు చేసిన సామెతను తప్పుబట్టారు. మహిళలు అంటే చంద్రబాబుకు అంత చులకనా? అని మండిపడ్డారు. అమ్మణ్ణమ్మ లేకపోతే చంద్రబాబు పుట్టేవారా? భువనేశ్వరి లేకపోతే చంద్రబాబుకు లోకేష్ అనే వారసుడు ఉండేవాడా? అని అన్నారు.