పంచాయతీల్లో వైసీపీ జైత్రయాత్ర ప్రారంభమైందా?: అప్పుడే ఏకగ్రీవం: తూర్పు గోదావరి జిల్లాతో
కాకినాడ: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ఆరంభమైంది. నామినేషన్ల పర్వానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తరఫు అభ్యర్థులను బలపరిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో కసరత్తు ఆరంభించింది. ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకునే ప్రక్రియను ప్రోత్సహించేలా జగన్ సర్కార్ భారీగా నజరానాలను ప్రకటించిన నేపథ్యంలో.. ఆ దిశగా పంచాయతీలు అడుగు వేస్తున్నట్టే కనిపిస్తోంది.
మరో ఎన్నికల సంగ్రామం: పంచాయతీ పోరు ముగిసిన వెంటనే: నిమ్మగడ్డకు చేతినిండా పని
తూర్పు గోదావరి జిల్లాలో ఓ పంచాయతీ అప్పుడే ఏకగ్రీవమైంది. ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఐ. పోలవరం మండలంలోని గోగుల్లంక పంచాయతీ ఎన్నిక ఏక్రగీవమైనట్లు పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వెల్లడించారు. గోగుల్లంక గ్రామ సర్పంచ్గా కాకర్లపూడి గీతాదేవి ఎన్నికైనట్లు వెల్లడించారు. గీతాదేవి..పొన్నాడ సతీష్ కుమార్ అనుచరుడు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు కాకర్లపూడి వెంకట సత్యనారాయణ రాజు భార్య. ఆమెను గోగుల్లంక గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వైసీపీ నాయకులు తెలిపారు.
Recommended Video
గోగుల్లంక గ్రామ పంచాయతీ కోసం ఎవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకూడదని స్థానిక నాయకులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గడువు ముగిసే వరకు నామినేషన్ పత్రాలేవీ దాఖలు కాకపోతే.. కాకర్లపూడి గీతాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ప్రస్తుతం గీతాదేవి మినహా మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకూడదని తీర్మానించుకున్న నేపథ్యంలో ఆమె ఎన్నిక లాంఛనప్రాయమేనని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఊపుతో జిల్లాలో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటామని పొన్నాడ సతీష్ చెబుతున్నారు.