అతనో గోల్డ్ మెడలిస్టు: జల్సాల కోసం కంపెనీకి కన్నమేశాడు
గుంటూరు: బిటెక్లో గోల్డ్ మెడల్ సాధించిన ఓ కంప్యూటర్ నిపుణుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి తాను పనిచేస్తున్న కంపెనీకే కన్నమేశాడు. రూ.15.5 లక్షలను దొంగిలించాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నర్సిరెడ్డి బీటెక్ గోల్డ్ మెడలిస్ట్. నరసరావుపేటలో నివాసం ఉంటున్నాడు. గతంలో హైదరాబాద్లో కంప్యూటర్కు సంబంధించిన వ్యాపారాలు చేసి నష్టపోయాడు. అదేసమయం లో జల్సాలకు అలవాటుపడ్డాడు.
దాంతో విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేసే సిస్కో ప్రైవేటు లిమిటెడ్లో ఎన్సీఆర్ ఇంజనీరుగా చేరాడు. అక్టోబరు 5న ఇద్దరు కస్టోడియన్లతో వచ్చి చిలకలూరిపేట ఇనుపకొట్ల బజారులోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశాడు.
కస్టోడియన్ల నుంచి పిన్ నంబర్లు రాబట్టిన నర్సిరెడ్డి అదేనెల 9న ఏటీఎంను తెరచి రూ.15,50,500 చోరీ చేశాడు. సమాచారం అందుకున్న సిస్కో మేనేజర్ ఏటీఎంను పరిశీలించి అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.13,20,000 స్వాధీనం చేసుకున్నారు.