జివోఎంకు రెండువేల మెయిళ్లు: విభజనపై మళ్లీ 7న భేటీ
న్యూఢిల్లీ: విభజన అంశంపై దాదాపు రెండువేల మెయిళ్లు అందాయని, వాటిని పరిశీలించేందుకు కొంత సమయం పడుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శనివారం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటయిన మంత్రుల బృందం(జివోఎం) శనివారం సాయంత్రం నాలుగు గంటలకు నార్త్ బ్లాకులో భేటీ అయింది. దాదాపు గంటన్నర పాటు వారు చర్చించారు. మళ్లీ నవంబర్ ఏడో తేదిన భేటీ కావాలని నిర్ణయించారు.
భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విభాగాల నుండి వివరణాత్మకమైన నివేదికలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. సుమారు రెండు వేల మెయిళ్ల ద్వారా తమకు సూచనలు అందాయన్నారు. వాటిని పరిశీలిస్తామని, కొంత సమయం పడుతుందన్నారు.
వచ్చిన ఈ మెయిల్స్ను ఆంధ్రప్రదేశ్, కేంద్ర అధికారులు కలిసి క్రోఢీకరిస్తారని చెప్పారు. వాటిని సంబంధిత శాఖలకు పంపిస్తామన్నారు. ఎపిలోని అన్ని విభాగాల నుండి తాము నివేదికలు కోరామన్నారు. విభజన అంశంపై శాఖల వారీగా నివేదికలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. మంత్రుల బృందం మళ్లీ వచ్చే నెల 7వ తేదీన భేటీ అవుతుందని చెప్పారు.
కాగా గంటన్నర పాటు సాగిన ఈ భేటీకి ఎకె ఆంటోనీ మినహా మంత్రుల బృందంలోని సభ్యులు అందరూ హాజరయ్యారు. ఆంటోనీ అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు.
బాబుకు జెపి పరామర్శ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హైదరాబాదులో శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఉంది ప్రభుత్వమా లేక ప్రయివేటు సర్కారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూనే సంప్రదింపుల ద్వారా పరిష్కారం చూపాలన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలను కేంద్రం విశ్వాసంలోకి తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని ధ్వజమెత్తారు.