నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్.. టీచింగ్ స్టాప్ భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంటే, మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులలో ఆశలు చిగురింపజేశారు. ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం జగన్ ఏపీలో త్వరితగతిన టీచింగ్ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో తెలుసుకొని వెంటనే గుర్తించి వాటిని భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడ ఎటువంటి పైరవీలకు తావులేకుండా చూడాలన్నారు. టీచింగ్ పోస్టుల భర్తీలో రాజీ పడితే విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్న సీఎం జగన్ సమర్థులైన టీచర్లను, ప్రతిభ ఉన్నవారిని టీచింగ్ స్టాఫ్ గా తీసుకోవాలని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో వారికి పరీక్షలు నిర్వహించి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరిశీలించి నియామకాలను చేపట్టాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఉద్యోగాలను కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని పేర్కొన్న జగన్ ఇప్పుడున్న కోర్సులకు సంబంధించి అనుబంధ కోర్సులు, ప్రత్యేక కోర్సులు తీసుకురావాలని, ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు ప్రావీణ్యం ఉన్న టీచర్లను నియమించాలని పేర్కొన్నారు. ఇక విద్యా వ్యవస్థకు సంబంధించిన అనేక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జగన్ ఉన్నత విద్యపై అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.