నోట్ల రద్దు: ఏపీ ఉద్యోగులకు చేదు, తెలంగాణ ఉద్యోగులకు 'ఆర్బీఐ' శుభవార్త
నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల విషయమై ఆందోళన కనిపించింది. తాజాగా, ఏపీలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు చేదువార్త రాగా, తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ఓ శుభవార్త వచ్చింది.
హైదరాబాద్/విజయవాడ: నోట్ల రద్దు నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల విషయమై ఆందోళన కనిపించింది. తాజాగా, ఏపీలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు చేదువార్త రాగా, తెలంగాణ ఉద్యోగులకు మాత్రం ఓ శుభవార్త వచ్చింది.
జీతాలు, పెన్షన్లు నగదుగా ఇవ్వడం సాధ్యపడదని ఏపీ ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. జీతాలు, పెన్షన్లు వారి ఖాతాల్లోనే జమ చేస్తామని తెలిపింది. సామాజిక భద్రత పెన్షన్లు కూడా ఖాతాల్లోనే జమ చేస్తామని, ఖాతాలు లేనివారు రెండురోజుల్లో ఖాతాలు తెరవాలని సూచించింది.
ఖాతాలు తెరవడానికి అధికారులు సహకరిస్తారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ తెలిపింది. బ్యాంకులలో వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని ఆర్థిక శాఖ తెలిపింది.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చింది. వచ్చే నెల 1న ఉద్యోగులకు జీతంలో రూ.10వేలను నగదు రూపంలో ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. దేశమంతా నగదు లేక అల్లాడుతుంటే ఈ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశం.
పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు తీసుకునే పరిస్తితి కనిపించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.
ఆర్బీఐ అంగీకరించింది. ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఏ బ్యాంకు బ్రాంచికి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications