జగన్ కు కేంద్రం మరో గుడ్ న్యూస్- ఈసారి రూ.12,911 కోట్లకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతోంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై పోరాటం చేస్తూ వస్తోంది. అదే సమయంలో కేంద్రంతో లాబీయింగ్ చేస్తూనే ఉంది. దీని ఫలితాలు ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ లోటు నిధుల్ని తాజాగా విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు మరో కీలకమైన నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్రానికి విభజన హామీల్లో భాగంగా నెరవేర్చాల్సిన వాటిలో ప్రత్యేక హోదాతో పాటు పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కూడా ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్టం తామే చేపడతామంటూ తీసుకుంది. దీంతో కేంద్రం కూడా నిధులు నేరుగా ఇవ్వకుండా రీయింబర్స్ మెంట్ చేస్తూ వస్తోంది. ఇలా పెండింగ్ లో పడిన నిధులు విడుదలకు నోచు కోవడం లేదు. వీటి కోసం తిరిగి లాబీయింగ్ చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈసారి మాత్రం గుడ్ న్యూస్ చెప్పింది.

పోలవరం ప్రాజెక్టుకు అదనంగా రూ.12911 కోట్ల నిధులు విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా జరిగిన జల్ శక్తి శాఖ సమావేశంలో ఆమోదించిన ప్రకారం ఏపీకి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.12911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జల్ శక్తి మంత్విత్వశాఖ కేంద్ర కేబినెట్ భేటీలో నోట్ పెట్టి ఆమోదం పొందాలని సూచించింది. ఇది లాంఛనమే కానుంది.
మరోవైపు ఇవాళ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును చాలాకాలం తర్వాత సందర్శించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అదనపు నిధులు విడుదల చేసి సహకరించేందుకు సిద్ధమైన తరుణంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ అధికారులతో తాజా పరిస్ధితిపై చర్చిస్తారు. అనంతరం వారికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చి తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications