జగన్ ఇలాకాలో గౌతమీపుత్ర శాతకర్ణికి దెబ్బ: ఉద్రిక్తత
వైఎస్ జగన్ ఇలాకా పులివెందులలో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ఫ్లెక్సీలను తొలగించారు. ఇది ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది...
కడప/ విజయవాడ/ ఒంగోలు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇలాకా పులివెందులలో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింగి. కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలోగల థియేటర్ల వద్ద అభిమానులు ఏర్పాటుచేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు.
దాంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఫ్లెక్సీలు తొలగించినందుకు నిరసనగా హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆందోళన నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో ఈ సంఘటన చోటుచేసుకోవడం పట్ల ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు.
ఇదిలావుంటే, 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా అభిమానులకు తాను అందించిన సంక్రాంతి కానుక అని చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. 'గౌతమిపుత్ర శాతకర్ణి' సాధించిన విజయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సాధించిన విజయమని, ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నానని బాలకృష్ణ అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, విదేశాల్లో కూడా భారీ ఆదరణతో దూసుకుపోతుందని చెప్పారు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచే ఒక అదృశ్య శక్తి తమ వెనకుండి నడిపించిందన్నారు. తక్కువ రోజుల్లో సినిమా పూర్తవడానికి సహకరించిన నిర్మాతలకు, దర్శకుడు క్రిష్ గారికి, మిగతా సాంకేతికి నిపుణులకు, తోటి కళాకారులకు ఆయన అభినందనలు తెలిపారు.
ఈ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం హీరోయిన్ శ్రియా మాట్లాడుతూ - చారిత్రక సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా విజయంతో సంక్రాంతి సంబరాలు రెట్టింపయ్యాయన్నారు.
కాగా, బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాస్తుందని ఎమ్మెల్యే కదిరి బాబూరావు అన్నారు. స్థానిక శేషమహాల్లో 'శాతకర్ణి' సినిమా విడుదల సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కదిరి కేక్ను కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.