పాలన పడకేసిందా?: బాబు సహా మంత్రులు కూడా విదేశాల్లోనే.., కష్టమే?
ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడంతో రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు పడకేశాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడంతో రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు పడకేశాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
విదేశీ పెట్టుబడులు, రాజధాని నిర్మాణాలకు సంబంధించిన డిజైన్ల అధ్యయనం కోసం సీఎం చంద్రబాబు అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి కూడా బాబు వెంట వెళ్లారు. ఇక మరో ఇద్దరు మంత్రులు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ కొల్లు రవీంద్రలు కూడా విదేశీ పర్యటనలోనే ఉన్నారు.
సీఎంతో కాకుండా వీరిద్దరు విడిగా విదేశీ పర్యటనకు వెళ్లారు. యూఏఈలో వీరు సీఎంతో కలవనున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా అమెరికా పర్యటనలో ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి పితాని సత్యానారయణ కూడా అక్టోబర్ 25నుంచి అమెరికాలో పర్యటిస్తున్నట్టు సమాచారం.
మొత్తం మీద సీఎం, అరడజను పైగా మంత్రులంతా విదేశాల్లో పర్యటిస్తుండటంతో సచివాలయంలో పెండింగ్ ఫైల్స్ పేరుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ పర్యటనల్లో ఉన్నవారికి తోడు మరో ఇద్దరు మంత్రులు కూడా విదేశీ పర్యటనలు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. బాబు అనుమతి కోసం వారు ఎదురుచూస్తున్నారట.
ఒకవైపు దీపావళి హడావుడి, మరోవైపు మంత్రులెవరూ సెక్రటేరియట్ వైపు రాకపోతుండటంతో సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చేవారికి నిరాశ తప్పడం లేదు. సీఎం రాష్ట్రంలో లేని నేపథ్యంలో పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు లోకేష్ ఆధ్వర్యంలో ఐదుమందితో కూడిన సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
కమిటీ అయితే వేశారు కానీ ఎక్కడా దాని ఊసే లేకుండా పోయిందంటున్నారు. సమస్యల పరిష్కారం విషయంలోను, పాలనా వ్యవహారాల విషయంలోను కమిటీ అంత యాక్టివ్ గా లేదని తెలుస్తోంది. దీంతో ఏపీలో పాలనా వ్యవహారాలు గాలికొదిలేశారా? అన్న అపవాదు కూడా వినిపిస్తోంది.