ఇదే తొలిసారని కిరణ్: శ్రీధర్ ఇష్యూపై నో, టీ టైమంటూ..
హైదరాబాద్: ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం చెప్పారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల నేతలతో ఐఆర్ పైన కిరణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం వారికి 27 శాతం ఐఆర్ ఇచ్చేందుకు అంగీకరించింది. 2014 జనవరి 1వ తేదీ నుండి మధ్యంతర భృతి అమలులోకి వస్తుంది. దీనిపై కిరణ్ మాట్లాడారు.
ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతున్నా ఉద్యోగుల సంక్షేమం కోసం 27 శాతం ఐఆర్కు అంగీకరించామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇంత ఎక్కువ ప్రకటించడం ఇదే తొలిసారి అన్నారు. జనవరి 1 నుండి అమలులోకి వస్తుందన్నారు. హెల్త్ కార్డుల పైన రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హెల్త్ కార్డుల ద్వారా 14.7 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఐఆర్ ఐదు నెలల ముందే ప్రకటించామన్నారు.
ఐఆర్ వల్ల ప్రభుత్వంపై రూ.7,681 కోట్ల భారం పడుతుందన్నారు. త్వరలో పిఆర్సీ పూర్తి చేస్తామని చెప్పారు. ఉద్యోగులు, పింఛన్దారులకు నగదు రహిత ఆరోగ్య కార్డులు జారీ చేస్తామన్నారు. ఇందుకోసం స్టీరింగ్ కమిటీని నియమిస్తామని చెప్పారు. 9.5 శాతం రెవెన్యూ లోటు ఉందని కిరణ్ చెప్పారు.
టి టైం అయింది
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగుల మధ్యంతర భృతి విషయమై మాట్లాడుతుండగా.. పలువురు విలేకరులు తెలంగాణ అంశం, శ్రీధర్ బాబు శాఖ మార్పుపై ప్రశ్నించారు. వాటిపై స్పందించేందుకు కిరణ్ సున్నితంగా తిరస్కరించారు. తాను ఉద్యోగుల ఐఆర్ విషయం గురించి మాట్లాడేందుకు వచ్చానని, ఇతర అంశాలు వద్దన్నారు. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని, అప్పుడు మీరే చూస్తారన్నారు. కాగా, పదే పదే తెలంగాణ గురించి విలేకరులు అడగడంతో కిరణ్ టి టైం అయిందంటూ(టి తాగేందుకు) ముగించారు.