కర్నూలు బదులు బెజవాడ: రాజధానిపై బాబు ఆసక్తికరం, చినరాజప్పను వెంటబెట్టుకొచ్చారు
Recommended Video
విజయవాడ: నాడు కర్నూలుకు బదులు రాజధాని విజయవాడకు వచ్చి ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ఉండేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం బ్యారేజీ 60 వసంతాల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తన ఆశయమని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ ద్వారా 13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. పట్టిసీను ఏడాదిలోపు పూర్తి చేసి రికార్డ్ సృష్టించామన్నారు.
కేంద్రం సహకరిస్తోంది
పోలవరం ప్రజల జీవనాడి అని చంద్రబాబు అన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. దీనిని పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేసే వరకు తాను నిద్రపోనను భావోద్వేగానికి లోనయ్యారు.
సకాలంలో ఇస్తే పూర్తి చేస్తాం
బిల్లులు సకాలంలో చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలనేది తమ ఆలోచన అని, ఈ నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది 12.5 శాతం వర్షపాతం తక్కువ పడిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 6.50 లక్షల పంటకుంటలు తవ్వామని, వాటి ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చామన్నారు.
మంచి చేసిన వారికి నివాళులు అర్పించాలి
ప్రకాశం బ్యారేజీ అరవై వసంతాలు పర్తి చేసుకోవడం సంతోషకరమని చంద్రబాబు అన్నారు. మంచి పని చేసిన వారికి నివాళులు అర్పించడం సంప్రదాయమని చెప్పారు. ప్రకాశం బ్యారేజీ కట్టక ముందు కరువు ఉండేదని, నీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నారు.
చినరాజప్పను వెంటబెట్టుకు వచ్చిన బాబు
కాగా, రూ.150 కోట్లతో నిర్మించనున్న ఫోరెన్సిక్ ల్యాబ్కు గురువారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన మనస్తాపం చెందారు. ప్రకాశం బ్యారేజీ వేడుకలకు చంద్రబాబు ఆయనను తన వెంట తీసుకు వచ్చారు. మంత్రులు దేవినేని ఉమ తదితరులు హాజరయ్యారు.