తెలంగాణాకు చంద్రబాబు వంత, పవన్ కళ్యాణ్ లా అలా వచ్చి వెళ్ళే మైసూరా రెడ్డి : శ్రీకాంత్ రెడ్డి ధ్వజం
తాజాగా రాయలసీమ ప్రాజెక్టులపై సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదని, కేంద్రం తీసుకొచ్చిన గెజిట్ ను ఎలా స్వాగతిస్తారని మాజీ మంత్రి ఎం.వి.మైసూరా రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా జలాల వివాదాన్ని చిలికి చిలికి గాలివానగా మార్చారని చంద్రబాబు సైతం ఆరోపణలు గుప్పించారు. గత ఎన్నికల సమయంలో తనను ఓడించడానికి కలిసి పనిచేసిన రెండు రాష్ట్రాల సీఎంలు, ఇప్పుడు జలవివాదాలు పరిష్కరించుకోవడం కోసం కూర్చొని మాట్లాడుకోలేరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు.
చంద్రబాబు ఎప్పటికీ రాయలసీమ ద్రోహినే
రాయలసీమ ప్రాజెక్టులపై ఆ నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, రాయలసీమ లిఫ్ట్ పై తన వైఖరిని ఇప్పటివరకు స్పష్టంగా చెప్పకుండా తెలంగాణకు వంత పాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ రాయలసీమ ద్రోహిగానే మిగిలిపోతారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల మట్టం నుంచే తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడుతుంటే అప్పుడు చంద్రబాబు గాని, మైసూరా రెడ్డి గాని నోరెందుకు మెదప లేదంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.
ఇది చంద్రబాబు చేసిన పాపం .. మండిపడిన ప్రభుత్వ చీఫ్ విప్
కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఇరు రాష్ట్రాలకు తాకట్టు పెట్టిన చంద్రబాబుకు సాగునీటి ప్రాజెక్టులపై విమర్శించే నైతిక హక్కు లేదని అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని, ఇది చంద్రబాబు చేసిన పాపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షనేతగా చంద్రబాబుకు ఉందా లేదా అని గట్టిగా నిలదీశారు. రాయలసీమ ప్రాజెక్టులపై తన స్టాండ్ చెప్పకుండా తెలంగాణకు అనుకూలంగా ప్రవర్తించడం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు విధానాల వల్ల రాయలసీమ రైతులకు గుండె కోత
చంద్రబాబు తన పదేళ్ల పాలన కాలంలో ఏ చిన్న ప్రాజెక్టులు చేపట్టకపోవడం వల్ల తెలుగు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని, తెలుగు ప్రజలకు ఆయన జీవితాంతం క్షమాపణలు చెప్పినా సరిపోదని గడికోట శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు విధానాల వల్ల రాయలసీమ రైతులు గుండె కోతకు గురయ్యారని ద్వజమెత్తారు శ్రీకాంత్ రెడ్డి.
చంద్రబాబు హయాంలో నాడు గాలేరు-నగరి పై నిర్మించిన గండికోట, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరిగేవని, చంద్రబాబు పూర్తి చేయకపోవడం వల్ల మనకు నష్టం జరిగిందని, ఈ పాపం చంద్రబాబుదేనని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఏం చేస్తున్నారు ?
తాను చేయకపోగా ఎవరైనా చేయదలుచుకుంటే గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్లు వేయించి స్టేలు తీసుకు వస్తారని నిప్పులు చెరిగారు. కేంద్రం ఇచ్చిన గెజిట్ పై కూడా తన స్పష్టమైన వైఖరి చెప్పకుండా చంద్రబాబు వ్యవహరించడం రాష్ట్రం పట్ల ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నీటి కేటాయింపులు కూడా రాజకీయం చేస్తున్న చంద్రబాబు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఎందుకు గట్టిగా ప్రశ్నించలేదని నిలదీశారు.
తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరారెడ్డి ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించిన ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ లా అలా వచ్చి ఇలా కనబడకుండా వెళ్తారు రాయలసీమ కు సంబంధించిన కొత్త వ్యక్తి అంటూ ఎం.వి.మైసూరా రెడ్డి ని టార్గెట్ చేశారు.
రాయలసీమ ప్రజల గొంతు కోస్తుంటే మీరంతా ఎక్కడున్నారని ఫైర్
నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రధాని మోడీ ని, తెలంగాణ సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తున్న ప్పుడు చంద్రబాబు. మైసూరారెడ్డి ఏం చేస్తున్నారు అంటూ నిలదీశారు. రాయలసీమ ప్రజల గొంతు కోస్తుంటే మీరంతా ఎక్కడున్నారు అంటూ మండిపడ్డారు. ఆరోజు మీ నోళ్లు ఎందుకు లేవలేదని ప్రశ్నించిన శ్రీకాంత్ రెడ్డి మీరు హైదరాబాద్లో ఉంటున్నారని భయపడ్డారా అంటూ సెటైర్లు వేశారు . తెలంగాణ ప్రభుత్వానికి లొంగి పోయారా అంటూ ప్రశ్నించారు.
Recommended Video
సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న జగన్ .. కాకుంటే న్యాయ పోరాటమే
సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడం కోసం సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని, సాధ్యం కానప్పుడు న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. మైసూరారెడ్డి వేరే అజెండాను మనసులో పెట్టుకొని మాట్లాడారు అన్న శ్రీకాంత్ రెడ్డి, గెజిట్ వచ్చినా, మరేది వచ్చినా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను న్యాయబద్ధంగా చేసే వరకు పోరాటం సాగించి తీరుతామని, ఎంతవరకైనా వెళ్తామని పేర్కొన్నారు. ప్రతి దానిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.