లాంచీని పైకి తేవడం:ఇంజనీర్లు,దళాల వల్ల కాలేదు... మత్స్యకారులు సాధించారు
పశ్చిమ గోదావరి:జిల్లాలోని మంటూరు సమీపంలో గోదావరి నదిలో నీటి మునిగి పెను విషాదానికి కారణమైన లాంచీని పైకి తెచ్చే ప్రక్రియలో ఆసక్తికర ఘట్టం చోటు చోటుచేసుకుంది.
Recommended Video

నీటి అడుగున 70 అడుగుల లోతున ఇసుకలో కూరుకుపోయిన ఈ లాంచీని పైకి తెచ్చేందుకు వివిధ ప్రభుత్వ దళాలు, ఇంజనీర్ల సహకారంతో చేసిన ప్రయత్నాలేవీ సఫలం కాలేదు...దీంతో ఆ లాంచీని పైకి తెచ్చేందుకు తమకు ఒక్క అవకాశం ఇచ్చి చూడమని అధికారులను కోరిన స్థానిక మత్స్యకారులు అంతమంది కష్టపడి సాధించలేని ఆ క్లిష్టమైన కార్యాన్ని అవలీలగా సాధించి ఔరా అనిపించారు...

వివిధ దళాలు...వ్యూహాలు విఫలం
మంటూరు సమీపంలో గోదావరి నదిలో ప్రమాదానికి గురై నీట మునిగిన లాంచీలోనే పలువురు ప్రయాణికులు జలసమాధి కావడంతో వారిని బైటకు తీసుకురావాలంటే ఆ బోటును పైకి తేవడం సహాయక చర్యల్లో తప్పనిసరి అయింది. దీంతో 70 అడుగుల లోతులో ఇసుకలో కూరుకుపోయిన ఈ లాంచీని పైకి తీసుకువచ్చేందుకు వివిధ ప్రభుత్వ దళాలు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత నావికదళం, స్థానిక పోలీసులు మొదట్లో మూడు వ్యూహాలను సిద్ధం చేశాయి. అయితే ఆ మూడు వ్యూహాలు సఫలం కాకపోవడంతో బుధవారం మధ్యాహ్నం వరకూ లాంచీని పైకి తీసుకురాలేకపోయారు.

ఆ వ్యూహాలు...1..2:విఫలం
ప్లాన్-1: నీట మునిగి ఇసుకలో కూరుకుపోయిన లాంచీకి తాళ్లు కట్టి ఒడ్డు నుంచి రెండు, మూడు లాంచీల ద్వారా బయటకు లాగాలనుకున్నారు.అందుకోసం మంగళవారం రాత్రే స్థానికంగా ఉన్న బోట్లు, లాంచీలను రప్పించారు. అయినా ఈ ప్రయోగం తగిన ఫలితం ఇవ్వలేదు. లాంచీ ఉన్నచోటు నుంచి కదల్లేదు.
ప్లాన్-2: ఆ తరువాత వ్యూహం 2 ప్రకారం బోటును ఖాళీ చేసీ అనంతరం దాన్ని పైకి తేవడం...ఇందుకోసం నీటి లోతుల్లోకి వెళ్లి ఈదగలిగే నావికాదళ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్లోని గజ ఈతగాళ్లను మునిగిన లాంచీ దగ్గరకు పంపించి ఒక్కో మృతదేహాన్ని బయటకు తీసుకురావాలని అనుకున్నారు. అలా పలు దఫాలుగా అనేక బృందాలను పంపించారు. అయితే ప్రమాదానికి గురైన లాంచీ తలుపులు లోపల నుంచి మూసేసి ఉండటంతో అతి కష్టం మీద కొన్ని అద్దాలను పగలకొట్టి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసుకురాగలిగారు. ఆ తర్వాత మరింత ప్రయత్నించినా సఫలం కాలేదు.

చివరి వ్యూహం-3:ఇదీ విఫలమే
ప్లాన్-3: నీట మునిగి ఉన్న లాంచీకి తాళ్లను కట్టి ఒడ్డుపైన క్రేన్ లేదా జేసీబీని పెట్టి లాగితే లాంచీని పైకి తేవచ్చనుకున్నారు. ఆ ప్రకారం లాంచీకి తాళ్లు కట్టి జెసిబితో లాగించగా లాంచి బరువు ఎక్కువగా ఉండటంతో ఆ తాళ్లు తెగిపోయాయి. దీంతో తాళ్లు తెగకుండా పోలవరం ప్రాజెక్టు సైటు నుంచి ఎక్కువ సామర్థ్యం కలిగిన ఇనుపతాళ్లను తెప్పించారు. వాటిని తీసుకెళ్లి మునిగిన లాంచీకి ఒకవైపున కట్టి క్రేన్తో లాగేందుకు ప్రయత్నించారు అయినా లాంచీ ఏమాత్రం కదల్లేదు.

అవకాశం...అడిగిన మత్స్యకారులు
లాంచీని పైకి తెచ్చేందుకు దళాలు చేస్తున్న కృషిని గమనించిన స్థానిక మత్స్యకారులు ఓటును పైకి తెచ్చేందుకు తమకు ఒక్క అవకాశం కల్పించాలని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారులను అడిగారు. అంతేకాదు తమపై అపనమ్మకం చూపుతున్న అధికారులకు ఆ లాంచీని పైకి తెచ్చి చూపిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో అప్పటికే సమయం మించిపోతుండటంతో అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో మత్స్యకారులకు అవకాశం ఇచ్చారు.

మత్స్యకారులు...సాధించారు...
దీంతో వెంటనే రంగంలోకి దిగిన స్థానిక మత్స్యకారులు దళాలు నిర్వహించిన ప్లాన్-3కి తమ ఆలోచనను జోడించారు. భారీ ఇనుప తాళ్లను తీసుకెళ్లి నేరుగా లాంచీకి కట్టడం కాకుండా వాటిని నీట మనిగి ఉన్న లాంచీకి చుట్టూ వలలాగా అల్లారు. అనంతరం లంగరు వేసేందుకు వాడే పరికరాన్ని ఆ వల మధ్యలో బోటు గరిమనాభి సమీపంలో ఒక చోట ఉంచి దాన్ని కూడా అక్కడ ఆ ఇనుపతాళ్లతో అనుసంధానం చేశారు. ఆ తరువాత ఒడ్డుపై నుంచి క్రేన్ సాయంతో లాగడం ప్రారంభించడంతో లాంచీ కదిలి రావడం మొదలైంది. అలా కొద్ది కొద్దిగా లాగుతూ దాదాపు గంటన్నర వ్యవధిలో మొత్తం లాంచీని పైకి తెచ్చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియలో దళాలకు కూడా సాధ్యం కాని ఆ పనిని మత్స్యకారులు సాధించడంతో అందరూ మనసారా మత్స్యకారులను అభినందించారు.












Click it and Unblock the Notifications