రవాణా రంగానికి ప్రభుత్వం చేయూత నివ్వాలంటోన్న ఎంపి కేశినేని నాని
విజయవాడ: భారత దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రంగం రవాణా రంగమని, అంతటి ప్రాధాన్యత కలిగిన రవాణా రంగానికి ప్రభుత్వాలు చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. వ్యవస్థలో రవాణా రంగం అతి కీలకమని గుర్తించి ప్రభుత్వాలు తోడ్పాటు నిచ్చినట్లయితే ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు.
కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఏర్పడి యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఘనంగా నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని మాట్లాడుతూ రవాణా రంగంలోకి రోజురోజుకీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశించడంతో పాటు తో పాటు అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. అందువల్ల ఆ మార్పులకు అనుగుణంగా సిబ్బందిని సిద్దం చేయడం కష్టమవుతోందన్నారు.
మోటారు వాహనాల తయారీ సంస్థలు కేవలం తయారీ తో సరిపెట్టుకోకుండా నైపుణ్యాభివృద్ది కేంద్రాలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు సిబ్బంది పనితనాన్ని మెరుగుపర్చాలని కోరారు. ఈ సందర్భంగా అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్ నుంచి వచ్చిన కొత్త వాహనాలను ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.