రాజధాని, సంస్థలు: బాబుకి చిక్కే, రాష్ట్రం కోసం డిమాండ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఇటీవలి వరకు ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై రాయలసీమవాసుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల రాజధాని పైన ఏర్పాటు చేసిన శివరామకృష్ణమన్ కమిటీ రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించినప్పుడు వారిని పలువురు నిలదీశారు.
కృష్ణా - గుంటూరు మధ్య రాజధాని ఏర్పడవచ్చునని, అమరావతి కేంద్రంగా ఉండవచ్చునని.. ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు కూడా విజయవాడ - గుంటూరు మధ్య ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇలా రాజధాని పైన పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రాయలసీమలో రాజధానిని కోరుకుంటున్న సీమ మేధావులు వివిధ అంశాలను తెర పైకి తీసుకు వస్తున్నారు. రాయలసీమలో రాజధాని ఉండాలని కొందరు, రాజధాని లేకపోయినా అభివృద్ధిపై దృష్టి సారించాలని ఇంకొందరు చెబుతున్నారు. రాజధాని విషయమై రాయలసీమలో వేడెక్కింది.
రాజధాని పైన రాయలసీమలో వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏఫీ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అనంతపురంను ఉపరాజధానిని చేసి.. రాయలసీమను అభివృద్ధి చేయాలని మరికొందరి వాదనగా ఉంది. రాజధాని కంటే అభివృద్ధి ముఖ్యమనే వారు కూడా లేకపోలేదు.
కేంద్ర సంస్థల పైన పోటాపోటీ
కేంద్ర సంస్థల పైన ఆంధ్రప్రదేశ్లో పోటా పోటీ నెలకొంది. కేంద్రం పదమూడు సంస్థలను ఏపీకి కేటాయించింది. అభివృద్ధిని వికేంద్రకరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైదరాబాదులా ఒకేచోట అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే చూస్తుండటం గమనార్హం.
మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత శైలజానాథ్ మంగళవారం మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన 13 సంస్థలలో ఎక్కువగా గుంటూరు, కృష్ణాలలో ఏర్పాటు చేయడం సరికాదని, అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు పలు సంస్థలు తమ తమ జిల్లాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు.