జగన్ నిర్ణయానికి గవర్నర్ బ్రేక్ : ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకు ఆమోదం లభించేనా : సీఎం భేటీ తరువాతే..!!
ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి గవర్నర్ బిశ్వభూషన్ బ్రేకులు వేయటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా శాసన మండలిలో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేసారు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఆ నలుగురి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా..ప్రభుత్వం నలుగురి పేర్లు ఎంపిక చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు కొయ్య మోషేన్ రాజు... రమేష్ యాదవ్.. లేళ్ల అప్పిరెడ్డి.. తోట త్రిమూర్తుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే, ప్రభుత్వం నుండి ఈ పేర్లు ఆమోదానికి వచ్చినా గవర్నర్ రెండు పేర్ల పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పెండింగ్ లో పెట్టినట్లు సమాచారం.
Recommended Video
ఆ ఇద్దరి పేర్లపై అభ్యంతరం..
గవర్నర్ నామినేటెడ్ కోటా కావటంలో ఈ నలుగురికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, రమేష్ యాదవ్..మోషేన్ రాజు పేర్ల పైన అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కానీ, మరో ఇద్దరు తోట త్రిమూర్తులు..లేళ్ల అప్పిరెడ్డి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం కావటంతో గవర్నర్ పెండింగ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. వారి పైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని..వారి పేర్లకు ఆమోద ముద్ర వేయవద్దంటూ ఫిర్యదులు వచ్చినట్లు చెబుతున్నారు. తూర్పు గోదావరికి చెందిన తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా గవర్నర్ కోటాలో నియమితలయ్యే వారు వివాదాలకు..ఆరోపణలకు దూరంగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీంతో.. ఈ ఇద్దరి పైన సమాచారం సేకరించిన రాజ్ భవన్ వర్గాలు ఈ విషయాన్ని ప్రభుత్వానికి వివరించాయి.
స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లి చర్చలు..
దీంతో..ఈ అంశం పైన నేరుగా గవర్నర్ ను కలిసి ఆ కేసుల అభ్యంతరాలు...స్పష్టత ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఆ సందర్భంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులతో పాటుగా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వివరణ ద్వారా గవర్నర్ ఆ రెండు పేర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని వైసీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వం నుండి ఏ ఫైల్ వెళ్లినా గవర్నర్ వెంటనే ఆమోదిస్తున్నారు. అభ్యంతరాలు ఏవీ లేకుంటే గంటల్లోనే వాటిని క్లియర్ చేస్తున్నారు.
ఎప్పుడూ అభ్యంతరం చెప్పని గవర్నర్..
శాసనసభ..శాసన మండలి లో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లుల విషయంలో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయినా...న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ వాటిని ఆమోదించారు. అతే సమయంలో...ఎన్నికల కమిషనర్ నియామక విషయంలో ప్రభుత్వం మూడు పేర్లను ప్రతిపాదించి..రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ పేరు కోసం ప్రయత్నాలు చేసినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. కానీ, గవర్నర్ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా రిటైర్డ్ సీఎస్ నీలం సాహ్ని పేరుకు ఆమోదం తెలిపారు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి తాను ఎంపిక చేసిన వ్యక్తుల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని గవర్నర్ ను ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు.
సాయంత్రానికి ఆమోదం పై అంచనాలు..
గవర్నర్ తో సీఎం భేటీ తరువాత ఆ రెండు పేర్లకు సైతం ఆమోదం లభించి..మొత్తంగా నలుగురినీ నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అప్పటికీ..గవర్నర్ ఏకీభవించక పోతే చివరగా ఆ ఇద్దరి స్థానంలో మరో ఇద్దరి పేర్లు ప్రభుత్వం నుండి ప్రతిపాదించే అవకాశం ఉంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం తాము ముందుగా పంపిన లిస్టులోనే అభ్యర్ధులనే గవర్నర్ ఆమోదిస్తారని బలంగా చెబుతున్నారు. ఈ సాయంత్రానికి ఈ అంశం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.