టిడిపి, టిఆర్ఎస్ సభ్యుల మధ్య తోపులాట: గవర్నర్కు రక్షణ కవచం
హైదరాబాద్:తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేస్తుండగా శనివారంనాడు తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తెలుగుదేశం సభ్యులను అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యులు ప్రయత్నించారు. ఈ సమయంలో తెలుగుదేశం, టిఆర్ఎస్ సభ్యులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. గవర్నర్కు టిఆర్ఎస్ సభ్యులు రక్షణ కవచంగా నిలబడ్డారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ముందుకు దూసుకు రావడానికి వారు ప్రయత్నించారు. ఈ సమయంలో టిఆర్ఎస్ సభ్యులు వారికి అడ్డుగా నించున్నారు.
టిడిపి ఎమ్మెల్యేలకు కాంగ్రెసు సభ్యులు మద్దకు ఇచ్చారు. ముంందుకు దూసుకు వచ్చిన టిడిపి సభ్యులు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కృష్ణారావులను టిఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. కాంగ్రెసు సభ్యులు సంపత్, రామ్మోహన్ రెడ్డిలను కూడా టిఆర్ఎస్ సభ్యులు అడ్డుకున్నారు. పార్టీ ఫిరాయింపులను తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రోత్సహిస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి, కాంగ్రెసు సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రసంగం కాపీలను విపక్షాల సభ్యులు చించేసి గవర్నర్ పైకి విసిరారు.
ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని, ఇందులో దిగువ స్థాయి ప్రజలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన శనివారంనాడు ప్రసంగించారు. ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల అభ్యంతరాల మధ్య ఆయన ప్రసంగం సాగింది. ఈ ఏడాది అభివృద్ధి రేటు 5.3 శాతం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు.
సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల సభ్యులు ప్రయత్నాలు చేశారు. కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మీ పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు సాయం చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బోనాలు, బతుకమ్మలను రాష్ట్ర పండుగలుగా గుర్తించామని చెప్పారు. జర్నలిస్టులకు, న్యాయవాదులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సేవారంగంలో 9.7 శాతం వృద్ధి కనబరిచినట్లు తెలిపారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించినట్లు గవర్నర్ తెలిపారు. దళితులకు మూడు ఎకరాల చొప్పున భూమి పంపిణీకి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఒక్కరికి సమాన పాలన అందిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటికీ నీటి కనెక్షన్ ఇస్తామని అన్నారు. గృహ నిర్మాణ పథకంపై సిఐడి విచారణ సాగుతోందని అన్నారు.