ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ పోరాడాలి: గోవింద రావు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు జనసేన అధినేత పవ్ కళ్యాణ్ పోరాటం చేయాలని ఎపి విద్యార్థుల జెఎసి రాష్ట్రాధ్యక్షుడు లగుడు గోవింద రావు కోరారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిం చాలని డిమాండ్ చేస్తూ ఏపి విద్యార్ధుల జేఏసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్ర వారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా జరిగింది. విద్యార్ధి జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో విద్యార్ధులు ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రం ముందు ఆరు డిమాండ్లను పెట్టారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, విశాఖ పట్నంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు ఇవ్వటంతో పాటు కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు భారీ రాయితీలను ఇవ్వాలని వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లతో ధర్నా చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గోవింద రావు డిమాండ్ చేశారు. ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా ఏపి సమస్యలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని కేంద్రంపై వత్తిడి తీసుకురావటంతో ఏపి ఎంపీలు విఫల మయ్యారని మండిపడ్డారు. ముఖ్యంగా కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టిడిపి ఎంపీలు రాజీనామా చేయటమా, లేదంటే ప్రత్యేక హోదాను తేవటమా, తేల్చుకోవాలని సవాల్ విసిరారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా పలువురు కేంద్ర మంత్రులు, నేతల ఇళ్ళను ముట్టడిస్తామని హెచ్చరించారు.