పోట్లాట వద్దు! మాట్లాడుకోండి: కేసీఆర్, బాబులకు వెంకయ్య సూచన
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్లు తరచుగా మాట్లాడుకుంటూ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎప్పుడూ కూడా పోట్లాడుకోవద్దని సూచించారు.
అమరావతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్లు తరచుగా మాట్లాడుకుంటూ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎప్పుడూ కూడా పోట్లాడుకోవద్దని సూచించారు. అన్నదమ్ముల మధ్య కూడా సమస్యలుంటాయని, మనసు విప్పి మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు దేశంలో అభివృద్ధిలో ముందుండాలని వెంకయ్య ఆకాంక్షించారు.
శనివారం అమరావతిలోని వెలగపూడి సచివాలయం ఆవరణలో రాష్ట్రానికి తొలిసారి ఉపరాష్ట్రపతి హోదాలో వచ్చిన వెంకయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. అంతకుముందు గన్నవరం ఏర్పాటు నుంచి వెలగపూడి వరకు ప్రజలు దారిపొడవునా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఓవైపు సంతోషం.. మరోవైపు విచారంగా ఉందని అన్నారు. ఉపరాష్ట్రహోదాలో రాష్ట్ర ప్రజలను కలిసినందుకు సంతోషంగా ఉందని.. అయితే ఇకనుంచి తరచూ ఏపీకి రావడం కుదరదనే విషయం తనకు బాధకు గురిచేస్తోందని అన్నారు. తనకు లభించిన ఈ ఘన స్వాగతాన్ని తాను తన జన్మలో మరిచిపోలేనని అన్నారు.
పూర్వ వైభవం తెస్తా..
చిన్న తనం నుంచి తనకు పట్టుదల ఎక్కువని... ఏదైనా అనుకుంటే సాధించేదాకా విశ్రమించలేదని... మనసు, శరీరాన్ని వంచి పని చేసేవాడినని వెంకయ్యనాయుడు అన్నారు. అందరి అభిమానంతో దేశంలోనే రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవి తనకు దక్కడం, తాను చేసుకున్న అదృష్టమని తెలిపారు.
రాజ్యసభ ఛైర్మన్ గా సభకు పూర్వ వైభవం తీసుకొస్తానని... పెద్దల సభగా మారుస్తానని చెప్పారు. పార్లమెంటులో దేశ భవిష్యత్తును మార్చేలా అర్థవంతమైన చర్చలు జరగాలని, అవినీతిని అంతమొందించేలా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య అన్నారు.
అర్థం లేని విమర్శలొద్దు.. శత్రువులం కాదు..
ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆవేదన దేశానికి మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్యానికి, చట్ట సభలకు మంచిది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కూలిపోయే అవకాశం ఉందని, ఈ పరిస్థితి తలెత్తకుండా కాపాడాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ విరోధులే కాని, శత్రువులు కాదని... అందుకే, విమర్శలు చేసుకునేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు తమను ప్రశ్నిస్తారని, ప్రజల్లో తాము చులకన అవుతామనే భయం ప్రజాప్రతినిధుల్లో ఉండాలని చెప్పారు.