అమరావతికి శంకుస్థాపన ఎలా చేశారు?: బాబుకు గ్రీన్ ట్రైబ్యునల్ షాక్
అమరావతి: నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ గురువారం నాడు ఝలక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన ఎలా చేశారని నోటీసులు జారీ చేసింది.
నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో పర్యావరణ చట్టాలు, నిబంధనలు పాటించలేదని శ్రీమన్నారాయణ అనే వ్యక్తి గ్రీన్ ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ప్రభుత్వానికి గ్రీన్ ట్రైబ్యునల్ నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వానికి, సీఆర్డీఏ, కేంద్ర పర్యావరణ శాఖలకు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని పేర్కొంది.
దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమకు పర్యావరణ అనుమతులు వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 19న అనుమతులు వచ్చాయని తెలిపింది. పర్యావరణ అనుమతులు వస్తే 24 గంటల్లో వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. అనంతరం విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.