కేంద్రం హామీ-బాబు ప్లాన్: ఆకాశానికి ధరలు, తుళ్లూరుకు ప్రభుత్వం గిఫ్ట్
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతం తుళ్లూరుతో పాటు పలు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మించనున్నందున ఆ ప్రాంతంలో భూముల ధరలు కోట్లకు పెరిగాయి. తాజాగా విశాఖపట్నంలోని భోగాపురంలోని ధరలు పెరుగుతున్నాయి. విభజన బిల్లులో పేర్కొన్న హామీల మేరకు కేంద్రం అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పలు సంస్థలను.. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తోంది.
ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆయా సంస్థలు ఏర్పాటు అయ్యే చోట భూముల ధరలు పెరుగుతున్నాయి. భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్, ఏవియేషన్ సిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇది ఏపీ లేదా విశాఖ శంషాబాద్గా మారిందని చెప్పవచ్చు. దీంతో భోగాపురం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ధరలు బాగా పెరిగాయి.
కొద్ది నెలల క్రితం వరకు ఇక్కడి భూముల ధరలు.. ఎకరానికి ఎనిమిది లక్షల వరకు ఉండేవి. అయితే, ఇక్కడ పదివేల ఎకరాల్లో ఏరో హబ్ నిర్మిస్తామని కేంద్రం ప్రకటించాక ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ఐదారు రెట్లు పెరిగాయి.
చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు ఇక్కడి భూములను కొంటున్నారు. ఇప్పుడు తక్కువ ధరకు భూములు కొనుక్కొని.. ఆ తర్వాత ఎక్కువ ధరలకు వాటిని ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకునే వారు చాలామంది రంగంలోకి దిగారంటున్నారు. ఏపీతో పాటు పక్క రాష్ట్రాలకు చెందిన పలువురు ఇన్వెస్టర్స్ ఇక్కడకు తరలి వస్తున్నారట.
ఉగాది వేడుకల కోసం తుళ్లూరుకు ఏపీ ప్రభుత్వం రూ.5కోట్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో ఉగాది వేడుకల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.5కోట్లు విడుదల చేసింది.
మలేషియా ఇండస్ట్రియల్ బోర్డ్తో చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం మలేషఇయా ఇండస్ట్రియల్ బోర్డ్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతంలో టూరిజం, టౌన్షిప్ల మాస్టర్ ప్లాన్, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడుల పైన ఇండస్ట్రియల్ బోర్డ్ ఆసక్తి చూపించింది.