మొదటి భార్యకు విడాకులు: దాచిపెట్టి పెళ్లికి సిద్ధపడిన వ్యక్తికి దేహశుద్ధి
నిజామాబాద్: మొదటి భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన యువకుడికి వధువు బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల గ్రామంలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా శంకరంపేట సమీపంలోని రాంరెడ్డిపేటకు చెందిన నీరడి కిషన్ (30)కు ఐదారేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం భార్యకు విడాకులు ఇచ్చిన కిషన్ అడ్విలింగాల గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మొదటి వివాహం గురించి తెలియని వధువు బంధువులు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.
పోచమ్మ పండుగ పూర్తి చేసి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఉదయం వరుడు వచ్చిన తరువాత అతనికి గతంలోనే వివాహమైందని తెలియడంతో అతనికి వధువు బంధువులు దేహశుద్ధి చేసినట్లు తెలిసింది.
అనంతరం వివాహం కుదిర్చిన అంజయ్య కోసం వెతకగా అతను పారిపోయినట్లు సమాచారం. ఉన్న ఒక్క కూతురుకు వివాహం చేయడానికి ఏర్పాట్లు చేసిన అమ్మాయి బంధువులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజశేఖర్ అడ్విలింగాల గ్రామానికి వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడారు. ఎలాంటి ఫిర్యాదు ఇవ్వక పోవడంతో తిరిగి వచ్చినట్లు సమాచారం.