ఇప్పటికీ కొడాలి నానిదే పైచేయి??
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అతని తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పదునైన మాటలతో దాడిచేస్తున్న కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి ఓడించాలనే పట్టుదలతో టీడీపీ శ్రేణులున్నాయి. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నేతల మధ్య ఐక్యత కొరవడటంవల్లే గుడివాడలో నిర్వహించాల్సిన మినీ మహానాడు వాయిదా పడింది. దీనిపై చంద్రబాబు పార్టీ నేతలపై ఫైరైనప్పటికీ వారి తీరులో మార్పు రాలేదు.
సీటు విషయమై స్పష్టత ఇవ్వని చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తారనే విషయంలో ఇంతవరకు చంద్రబాబునాయుడు స్పష్టత ఇవ్వలేదు. కానీ రావి వెంకటేశ్వరరావు ఇన్ ఛార్జిగా ఉన్నారు. సీటు ఆశించేవారంతా ఎవరికి వారుగా ఇక్కడ పనిచేసుకుంటున్నారు. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఐకమత్యం లేదు. ఈ విషయం ఇబ్బందికరంగా మారడంతో రావి వెంకటేశ్వరరావు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గుడివాడ వెళ్లి పార్టీ నేతలంతా ఐకమత్యంగా పనిచేయాలని ఆదేశించారు.
అధినేత చెప్పినా అంతే.. బేఖాతర్
అధినేత చెప్పినప్పటికీ తమ్ముళ్లు మాత్రం కలవలేదు. ఈలోగా ఎన్నారై వెనిగండ్ల రాము గుడివాడలో జోరుగా పనులు చేస్తున్నారు. సేవా కార్యక్రమాలను విస్తరించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు రాముకేనని ప్రచారం మొదలైంది. సేవా కార్యక్రమాలు నిర్వహించడంద్వారా నాయకులందరినీ రాము కలుపుకొని వెళుతున్నారు. అధిష్టానం ఆదేశాలతోపాటు రాము సేవా కార్యక్రమాలు తెలుగు తమ్ముళ్లలో ఐకమత్యాన్ని పెంచింది. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా పార్టీ నేతలు రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ గుడివాడ వచ్చి అన్న క్యాంటిన్ ను అదేరోజు ప్రారంభించారు.
ఈ ఐక్యత చివరి వరకు ఉంటుందా?
ఎన్నికల సమయంలో చివరి నిముషంలో స్థానికంగా ఉన్న పార్టీ నేతలే చివరి నిముషంలో కొడాలి నానికి మద్దతు పలుకుతారని, ఈసారి అటువంటి పరిస్థితిని తీసుకురానివ్వనని రావి వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఎన్టీఆర్ వర్థంతి పుణ్యమా అని నాయకులంతా ఒక వేదికమీదకు వచ్చి పనిచేశారు. ఈ ఐక్యత ఎన్నికల వరకు ఉంటుందా? లేదా? అనేది సందేహాస్పదమే. సీటు విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వనంతవరకు ఇక్కడ కొడాలి నానిదే పైచేయిగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది ముందుగానే బలమైన అభ్యర్థిని ప్రకటించి స్థానిక నాయకుల మధ్య విభేదాలు లేకుండా సీనియర్ నేతలతో ఐక్యత కుదిర్చి ఒకటికి రెండుసార్లు చంద్రబాబు పరిశీలన చేస్తుంటేనే పార్టీ తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందని భావిస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించకుండా దాగుడుమూతలాడినంతకాలం కొడాలిదే పైచేయిగా ఉంటుందని, చివరి నిముషంలో ఎంపిక చేయబడ్ద వ్యక్తి వచ్చి గుడివాడలో చేసేది కూడా ఏమీ ఉండదంటున్నారు.