ముందేమో హూంకరింపు...తరువాత కాళ్ల బేరం...ప్రభుత్వ వైద్యుడి నిర్వాకం...
వైద్యో నారాయణ అంటే వైద్యుడు దేవుడితో సమానం అని...అయితే ఇది నేటికాలంలో చాలామంది డాక్టర్లకు ఏమాత్రం వర్తించదనేది పచ్చి నిజం...ఎందుకంటే ప్రాణాలు పొయ్యాల్సిన డాక్టర్లే కాసుల కోసం కక్కుర్తితో రోగుల ప్రాణాలతో చెలగాడమాడుతున్న పరిస్థితి అనేక సందర్భాల్లో కనిపిస్తోంది. అలా డబ్బు కోసం మహిళా రోగి పట్ల నీచంగా వ్యవహరించిన ఒక వైద్యుడి నిర్వాకమిది.
అతనో ప్రభుత్వ వైద్యుడు...గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గైనకాలజీ ప్రొఫెసర్. అయితే గర్భ సంచి సమస్యతో ఒక పేద మహిళ ఆర్ఎంపి సూచనతో ఇతడు ప్రైవేట్ గా నడిపే క్లినిక్ కి చికిత్స కోసం వచ్చింది. అయితే ఆపరేషన్ కు 50 వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఈ డాక్టర్ చెప్పాడు. పేషెంట్ పేదరాలు కావడంతో అంత డబ్బు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకోలేనని చెప్పి వెళ్లిపోయింది. అయితే ఆ తరువాత ఆమె చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రాగా అక్కడ ఆమెకు ఆపరేషన్ చెయ్యాలని నిర్ణయించారు. అయితే ఈ ఆపరేషన్ చెయ్యాల్సిన సదరు ప్రైవేట్ క్లినిక్ నడిపే ప్రభుత్వ వైద్యుడు ఈమెకు ఆపరేషన్ చేయడానికి నిరాకరించడమే కాదు అసలు ఎవరినీ ఈమెకు సర్జరీ చెయ్యకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం, పేషెంట్ ను ఆస్పత్రి నుంచి గెంటేయించడం చేశాడు. ఈ వివాదంతో ఈ బ్యాడ్ డాక్టర్ బండారం బైటపడింది.
అసలేం జరిగిందంటే...
దాచేపల్లి మండలం కేశనపల్లికి చెందిన హనుమంతరావు భార్య శైలజ ఏడాది క్రితం గర్భసంచికి సంబంధించిన వ్యాధితో ఊరిలోని ఆర్ఎంపీని సంప్రదించింది. అతను గుంటూరు కొత్తపేటలో ప్రభుత్వ వైద్యుడు చంద్రశేఖర్ నడుపుతున్నప్రైవేట్ క్లినిక్ కి పంపించాడు. అక్కడ ఏడాదిగా చికిత్స పొందుతున్నా లక్షన్నరకు పైగా ఖర్చు పెట్టినా ఆమె వైద్యుడిని ప్రశ్నించగా గర్భసంచికి శస్త్రచికిత్స చేయాలని, రూ.50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. అంత మొత్తం భరించే శక్తి లేకపోవడంతో పేషెంట్ భర్త హనుమంతరావు తన భార్యను డిసెంబరు 14న జీజీహెచ్కు తీసుకొచ్చాడు అక్కడ ఓపీ విభాగంలోని ఒక వైద్యురాలు పేషెంట్ ను పరీక్షించి ఆపరేషన్ నిమిత్తం గైనకాలజీ ప్రొఫెసరు దగ్గర పంపించారు.
అతడే ఇతడు...
అయితే ఆపరేషన్ కోసం గైనకాలజీ ప్రొఫెసర్ దగ్గరుకు వెళ్లిన పేషెంట్ ఆయనను చూసి ఖంగుతింది. కారణం తన ఆపరేషన్ కు 50 వేలు ఖర్చు అవతాయని చెప్పిన డాక్టరే ఈ ప్రొఫెసర్ అని తెలిసి భయపడింది. ఆ డాక్టర్ ప్రొఫెసర్ కూడా అందుకు తగ్గట్లే...‘నా క్లినిక్ కాదని జీజీహెచ్కు వస్తావా?' అని మండిపడి ‘నా క్లినిక్ కాదని జీజీహెచ్కు వస్తావా?' అంటూ...తన దగ్గర ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, పీజీలకు ఈమెకు ఆపరేషన్ చేయొద్దని ఆదేశించి...పేషెంట్ శైలజను, ఆమె కుమార్తెను ఆస్పత్రి నుంచి గెంటేశారు.
తరువాత...వేరే డాక్టర్ ఆపరేషన్...
దీంతో ఏంచెయ్యాలో తెలీక పేషెంట్ భర్త తనకు తెలిసివారితో వెళ్లి స్థానిక ఎమ్మెల్యే పీఏను కలిశాడు. అతను ఆర్ఎంవో రమేశ్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. సదరు వైద్యుడిని పిలిచి ఆపరేషన్ చేయాలని ఆర్ఎంవో కోరినా ఆ వైద్యుడు వినలేదు. మరోవైపు శైలజ పరిస్థితి విషమిస్తుండటంతో అదే విభాగానికి చెందిన డాక్టర్ ప్రభావతికి ఆర్ఎంవో రమేశ్ విషయం చెప్పి కిందటి నెల 26న ఆపరేషన్ చేయించారు. అలా శైలజ ప్రస్తుతం జీజీహెచ్లోని 112వ వార్డులో కోలుకుంటోంది. తనలాంటి ఇబ్బంది మరొకరికి ఎదురు కాకూడదని పేషెంట్ భర్త ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేశాడు.
Recommended Video
కాళ్లబేరానికి వచ్చిన ప్రొఫెసర్...
ఈ వివాదం బైటపడి ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడంతో పరిస్థితి విషమిస్తోందని అర్ధం చేసుకున్న సదరు వైద్యుడు చంద్రశేఖర్ ప్రస్తుతం జీజీహెచ్లోనే చికిత్స పొందుతున్న ఆ పేషెంట్ ను వెతుక్కుంటూ వెళ్లి...‘మీ కాళ్లు పట్టుకుంటా..నా ప్రైవేట్ క్లినిక్కు కట్టిన లక్షన్నరకు అదనంగా మరో లక్ష ఇస్తా..తప్పు జరిగింది..క్షమించండి.' అని వేడుకున్నట్లు తెలిసింది. పైగా పేషెంట్ కు ఆపరేషన్ చేసిన వైద్యురాలు ప్రభావతినే తీసుకుని ఆదివారం ఉదయం పేషెంట్ శైలజ దగ్గరకు వచ్చి...అందరి సమక్షంలోనే ఆమె కాళ్లు పట్టుకుని తన తప్పును ఒప్పుకున్నట్లు తెలిసింది. అయితే డాక్టర్ డబ్బు ఇస్తానన్నాఫిర్యాదు వెనక్కి తీసుకోవడానికి బాధితురాలు ఒప్పుకోలేదట. మరెవరికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని ఆమె కోరుతోందట.
వైద్యుడి నిర్వాకంపై విచారణ...
తన క్లినిక్లో ఆపరేషన్ చేయించుకోలేదని కోపంతో రోగిని తీవ్ర ఇబ్బంది గురిచేసిన వైద్యుడు చంద్రశేఖర్ పై విచారణ మొదలైంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు సైతం రంగంలోకి దిగారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బాధితులను డాక్టర్ ఎంతగా బతిమాలినా, వెనక్కి తీసుకునేది లేదని బాధితులు స్పష్టం చేయడంతో విచారణ ఎదుర్కోక తప్పని స్థితి. మరోవైపు గతంలో సైతం ఎన్నో ఆరోపణలు ఉన్న ఈ కక్కుర్తి ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహారం ఎలా ముగుస్తుందో వేచిచూడాలి.