నా భార్యను రక్షించండి.. రూ.4లక్షలకు అమ్మేశారు: సీఎం, జగన్లకు ఓ వ్యక్తి లేఖ
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన మరో బాధితురాలి కథనం నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది.
నెల్లూరు: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన మరో బాధితురాలి కథనం వెలుగుచూసింది. ఖతర్ వెళ్లి బాగా సంపాదించాలనుకున్న ఓ మహిళ.. ఏజెంట్ల చేతిలో మోసపోయి కువైట్ లో చిత్రహింసలు అనుభవిస్తోంది.
ఎలాగోలా భర్తకు ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేయడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అలాగే సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు కూడా లేఖలు రాసి తన భార్యను రక్షించాల్సిందిగా కోరాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలోని గూడూరు పార్క్ ప్రాంతానికి చెందిన రమణయ్య, పోలమ్మ భార్యభర్తలు. గల్ఫ్ దేశాలకు వెళ్తే బాగా డబ్బు సంపాదించవచ్చునని భావించారు. ఈ మేరకు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన గురవయ్య, మస్తాన్ భాషా, శేషు, అమరావతి అనే ఏజెంట్లను ఈ ఏడాది జనవరిలో సంప్రదించారు.
ఏజెంట్లు రూ.1లక్ష ఇస్తే ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో.. ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి డబ్బు చెల్లించారు.తీరా డబ్బు చెల్లించాక.. రమణయ్యకు వీసా రాలేదని, పోలమ్మకు మాత్రమే వీసా వచ్చిందని అన్నారు. ముందు చెప్పినట్లుగా ఖతర్ కాకుండా కువైట్ పంపించారు.
నాలుగు నెలల పాటు పోలమ్మ ఇంటికి కొంత డబ్బు పంపించింది. దీంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఏజెంట్లు రూ.4లక్షలకు తననను అమ్మేశారని పోలమ్మ ఫోన్ చేసి చెప్పడంతో రమణయ్య షాక్ తిన్నాడు. రూ.4లక్షలు చెల్లిస్తేనే అక్కడివారు తనను తిరిగి పంపుతామంటూ బెదిరిస్తున్నారని అన్నారు.
ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టేశానని, ఇక డబ్బులు ఎక్కడినుంచి తీసుకురావాలని రమణయ్య నిస్సహాయ స్థితిలో విలపిస్తున్నాడు. ఇదే క్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లకు లేఖలు రాసి తన భార్యను వెనక్కి రప్పించాల్సిందిగా లేఖలు రాశాడు. ఇదే విషయమై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లోను ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయమని రమణయ్య ధీనంగా వేడుకుంటున్నాడు.