వైసీపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన గుంపుల రవికుమార్ అనుమానాస్పద మృతి
నందికొట్కూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుంపుల రవికుమార్ హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
హైదరాబాద్: నందికొట్కూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గుంపుల రవికుమార్ హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రవికుమార్(35) స్వస్థలం కర్నూలు.
శనివారం ఉదయం రవి తన గదిలో మృతిచెంది కన్పించారు. రక్తపు విరేచనాలు, వాంతులతో మృతిచెందినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. దీంతో రవికుమార్ అనారోగ్యంతో మృతిచెందినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎన్నిక చెల్లదని రవికుమార్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రవి మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన గదిలో రవికుమార్ మృతదేహం కూడా రక్తపు మడుగులో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.