దారుణం: ఎంబీబీఎస్ విద్యార్థినిని గొంతుకోసి హతమార్చిన యువకుడు
గుంటూరు: జిల్లాలోని పెదకాకాని మండలంలోని తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ విద్యార్థిని తపస్విపై జ్ఞానేశ్వర్ అనే యువకుడు సర్జికల్ బ్లేడ్తో దాడి చేశాడు. దీంతో తపస్వికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను గుంటూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తపస్విని తీవ్రంగా గాయపర్చిన అనంతరం జ్ఞానేశ్వర్ తన చేయి కోసుకున్నాడు. ఘటన అనంతరం స్థానికులు నిందితుడిని పెదకాకాని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన నిందితుడు జ్ఞానేశ్వర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరికి పనిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ప్రేమపడ్డారు. ఇటీవల మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో తక్కెళ్లపాడులోని ఓ డెంటల్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు.. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు తన వద్దకు పిలిచింది. దీంతో వారం రోజులుగా తపస్వి తన స్నేహితురాలి వద్దే ఉంటోంది. తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించడం లేదని కోపం పెంచుకున్న జ్ఞానేశ్వర్ హతమార్చాలని కుట్ర పన్నాడు.
సోమవారం తపస్వి స్నేహితురాలు ప్రేమికులిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయగా.. ఆ సమయంలోనే జ్ఞానేశ్వర్ ఆగ్రహంతో తపస్విపై సర్జికల్ బ్లేడుతో గొంతుకోశాడు. పక్కనున్న స్నేహితులు కేకలు వేసి బయటకు వెళ్లడంతో స్థానికులు వచ్చారు. దీంతో జ్ఞానేశ్వర్ తలుపులు మూసేసి.. కొనఊపిరితో ఉన్న తపస్విని ఓ గది నుంచి మరో గదికి ఈడ్చుకుంటూ వెళ్లాడు. స్థానికులు తలుపులు పగులగొట్టి ఆమెను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.