సంధ్యారాణి ఆత్మహత్య: ప్రొఫెసర్ అరెస్ట్కు డిమాండ్, మెజిస్టేరియల్ విచారణ
గుంటూరు: గుంటూరు వైద్య కళాశాల గైనిక్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసేంత వరకు సమ్మె విరమించమని జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మెడికల్ విద్యార్థి సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన లక్ష్మిని అరెస్టు చేయటంలో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
గురువారం భారీ సంఖ్యలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు ఆస్పపత్రి నుంచి పాలనాధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు. రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు సుబ్బారావు గుంటూరు వచ్చి వారితో నేరుగా చర్చించినప్పటికీ ఫలితం కనిపించలేదు.
మరోవైపు గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మోదుగుల వేణుగోపాల్రెడ్డి ఆసుపత్రికి వచ్చి అధికారులతో చర్చలు జరిపారు. సమ్మె విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.
సంధ్యారాణి మృతిపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశం
కాగా, సంధ్యారాణి మృతిపై ప్రభుత్వం మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది. కాగా, ఆందోళన చేస్తున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
కాగా, గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎవివి లక్ష్మిని సస్పెండ్ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు ఇప్పటికే ప్రకటించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) సుబ్బారావు ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
గుంటూరు వైద్య కళాశాల గైనకాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆదివారం ప్రొఫెసర్ డా. లక్ష్మి వేధింపుల కారణంగా ఆత్మహత్యకు యత్నించి సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందింది. సంధ్యా రాణి.. ప్రొఫెసర్ విషయాన్ని డైరీలో రాసుకోవడంతోపాటు, కుటుంబసభ్యులకు పలుమార్లు ఫోన్లో ఆమె వేధింపుల గురించి వివరించింది.
దీంతో సంధ్యారాణి మృతిపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ లక్ష్మిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ లక్ష్మిని ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఆమెపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతుందని, నివేదిక అందిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు తెలిపారు.