ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గానికి ఎప్పుడూ డిమాండే??
ఆంధ్రప్రదేశ్లో ఆ నియోజకవర్గానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఎన్ని పార్టీల నుంచి ఎంతమంది అభ్యర్థులైనా అక్కడినుంచి పోటీచేస్తే విజయం ఖాయమనే అంచనాలో ఉంటారు. చివరి ఓటు పడేంతవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు. జనతాపార్టీకానీ, తెలుగుదేశం పార్టీకానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకానీ... ఏ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తికైనా గెలుపుమీద ఆశలు కల్పించేదే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం.

అందరి ఆప్షన్ గుంటూరు పశ్చిమ
మారుతున్న కాలానికి అనుగుణంగా అభివృద్ధి పథంలో పయనిస్తూ ఈ నియోజకవర్గం ఎంతోమంది రాజకీయ నేతలను ఆకర్షిస్తుంటుంది. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నవారి నుంచి కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారి వరకు అందరి ఆప్షన్ గుంటూరు పశ్చిమగా ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ, తెలంగాణ, అమెరికా... ఇలా ఎక్కడినుంచైనా రాజకీయాల్లో పోటీచేయాలనుకునేవారంతా గుంటూరు పశ్చిమగడ్డమీద అడుగుపెడతారు. ఎందుకంటే అక్కడ గెలుపు అవకాశం వారిని ఆకర్షిస్తుంటుంది. అలా.. అందరినీ ఊరిస్తుంటుంది.. అంచనాలు తారుమారు చేస్తుంటుంది.

గెలుపు అవకాశాలను ఊరిస్తూ ఉంటుంది
ఈ నియోజకవర్గంలో మిగతాపార్టీలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి కొంచెంపట్టు ఎక్కువ. నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజలే ఇక్కడ ఎక్కువగా ఉంటారు. ఇక్కడివారికి కావల్సింది పార్టీలుకాదు.. తమ నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారని భావిస్తారో వారికే పట్టం కడతారు. 2014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి పోటీచేసి ఓటమి పాలైన మద్దాలి గిరికి తెలుగుదేశం పార్టీ మరో అవకాశం ఇస్తూ గుంటూరు పశ్చిమకు పంపించింది. దీంతో ఆయన విజయం సులభమైంది. అభ్యర్థులకు గెలుపు అవకాశాలను ఊరిస్తూ ఉంటుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.

ఈసారి కూడా హోరాహోరీ పోరు?
ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కోవెలమూడి రవీంద్ర (నాని) పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తుండటంతో నానిని ఇన్ఛార్జిగా నియమించారు. ఆయనతోపాటు మన్నవ మోహన్ కృష్ణ, భాష్యం ప్రవీణ్ రేసులో ఉన్నారు. చివరి నిముషంలో ఎవరు వస్తారో తెలియదు. పొత్తులో భాగంగా తెనాలి స్థానాన్ని జనసేనకు కేటాయిస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇక్కడి నుంచి పోటీచేయాలనే యోచనలో ఉన్నారు.

వైసీపీ తరఫున మద్దాలి గిరి
వైసీపీ తరఫున ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బరిలో నిలబడదామనుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినవారినే వైసీపీ తరఫున నిలబెట్టపోతున్నట్లు అధిష్టానం ప్రకటించడంతో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున మద్దాలి గిరి పేరు ఖాయమైంది. గత ఎన్నికల్లో గిరిమీద ఓటమి పాలైన చంద్రగిరి ఏడుకొండలు కూడా నిరాశకు గురయ్యారు.












Click it and Unblock the Notifications