గుంటూరు జిల్లా టిడిపిలో... వారసులొచ్చేస్తున్నారంట...
గుంటూరు: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించడానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారసులను రాజకీయాలకు సమాయత్తం చేస్తున్నారు. వారెవరంటే...
గుంటూరు జిల్లాలో కొంతమంది సీనియర్ టిడిపి నేతల వారసులు ఇప్పటికే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా మరికొందరు ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజకీయ మెళకువలు నేర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పాలిటిక్స్ లోకి వీరి ఆరంగ్రేటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగే వారుసులు వీళ్లేనా? అంటే అందుకు సమాధానం వీళ్లే కాదట వీళ్లతో పాటు అప్పటికి ఈ లిస్టు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు స్థానికులు.

టిడిపి నుంచే ఎక్కువగా...
గుంటూరు జిల్లాలో మిగతా పార్టీల నుంచి రాజకీయ రంగప్రవేశం చేసే వారసులు పెద్దగా కనిపించడం లేదు. అయితే అధికార పార్టీ అయిన టిడిపిలో మాత్రం ఈ వారసుల హడావుడి బాగా కనిపిస్తోందంటున్నారు. పైగా ఈ వారసుల్లో కొందరు ఇప్పటికే పార్టీ కార్యక్రమాలతో పాటు తమ పరిపాలనా వ్యవహారాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తుండగా, మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆలంబనగా చేసుకొని మెళకువలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

బాగా ఉపకరిస్తున్న ఇంటింటికి టిడిపి...
ఇటీవల తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్నిగుంటూరు జిల్లాలో రాజకీయ వారసులు బాగా సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా నియోజకవర్గాల్లో ఓటర్లను, ప్రజలను కలుసుకుని వారితో మమేకం అయ్యే అవకాశాన్ని బాగానే అందిపుచ్చుకున్నారట.

వారసుల్లోనూ సీనియర్లు...జూనియర్లు...
కొంతమందిపలువురు నేతల కుమారులు గత ఎన్నికల్లోనే తమ తండ్రులకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించారు. ఎన్నికల మేనేజ్మెంట్, జనసమీకరణ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని నియోజకవర్గాలోని ద్వితీయ స్థాయి నాయకులతో కలిసి పనిచేశారు. అలాంటివారు ఇప్పుడు ఇంటింటికి టిడిపితో తమ సీనియార్టీని మరింత పెంచుకోగా కొత్తగా తెరంగ్రేటం చేస్తున్న వారసులు మాత్రం పార్టీ ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని వారు సద్వినియోగం చేసుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో వీరే వారసులు...
ఎపి శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాలలో అన్ని తానై ఇంటింటికి టీడీపీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే లోక్సభ సీనియర్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఇంటింటికీ తెలుగుదేశం లో జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తిరిగారు. అలాగే పెదకూరపాడు శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్ తన కుమారుడు సాయితేజ ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో చురుగ్గా తిరిగారు. పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ను ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలుగు తమ్ముళ్లు పరిచయాలు పెంచుకున్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని కుమారుడు మహేష్ కూడా ఇంటింటికీ తెలుగుదేశం ప్రారంభ కార్యక్రమం లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

మరికొందరి పేర్లు...
ఎపి శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె కూడా ఈసారి రాజకీయ రంగప్రవేశం చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అలాగే గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ సోదరి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమార్తె కూడా రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీచెయ్యాలని భావిస్తున్నారట. ఇక్కడ కుదరకపోతే చిత్తూరు జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగాలని పట్టుదలతో ఉన్నారట. అంతే కాదు ముందే ఎందుకు హడావుడి...ఇప్పుడే పేర్లు బైటకి వస్తే అవకాశాలకు గండికొట్టేవాళ్లు కాచుకొని ఉంటారని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న మరికొంతమంది సైలెంట్ కిల్లర్ లు కూడా ఉన్నారట. వాళ్లు కరెక్ట్ టైమింగ్ లో ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులకు మైండ్ బ్లాంక్ చెయ్యడం ఖాయమంటున్నారు స్థానిక నేతలు.

వైసిపిలో...ఒకే ఒక్కడు...
ఇక వారసుల ఆరంగ్రేటం గురించి ప్రతిపక్ష పార్టీ వైసీపీలో చూస్తే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. ఈ పార్టీ నుంచి వచ్చే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుడ కనిపిస్తుంది ఇతడొక్కడే. కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన కాసు మహేష్ రెడ్డి ఇప్పటికే వైసిపికి గురజాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.

యువతలో జోష్...
ఇలా వారసుల రాకతో ఆయా నియోజకవర్గాల పరిధిలోని యువతలో మాత్రం మంచి జోష్ కనిపిస్తోందట. ఇలా పార్టీకి యువరక్తం తోడవటం వల్ల పార్టీ కార్యక్రమాలు మరింత దూసుకుపోతాయని సీనియర్లు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా వారసుల రాకతో టిడిపిలో మాత్రం కోలాహలం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications